కదిరి బాబురావులా శిల్పాకు షాక్ తగులుతుందా? నామినేషన్ చెల్లుతుందా, ఎవరి వాదన ఏమిటి
నంద్యాల ఉప ఎన్నికలు సోమవారం ఊహించని మలుపు తిరిగాయి. అభ్యర్థులు, ఇరు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్న సమయంలో టిడిపి నేతల అభ్యంతరంతో కుదుపు చోటు చేసుకుంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు సోమవారం ఊహించని మలుపు తిరిగాయి. అభ్యర్థులు, ఇరు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్న సమయంలో టిడిపి నేతల అభ్యంతరంతో కుదుపు చోటు చేసుకుంది.
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని, నిబంధనల మేరకు జ్యూడిషియల్ స్టాంప్ వాడలేదని టిడిపి నేతలు ఆరోపించారు. అఫిడవిట్పై సంతకం చేసిన నోటరీ రెన్యూవల్ కాలేదని టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి వాదన వారిది
తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలతో నంద్యాల ఉప ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లుతుందా, చెల్లదా అనే చర్చ సర్వత్రా జరిగింది. నామినేషన్ చెల్లుబాటు విషయంలో టిడిపి, వైసిపిలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
Recommended Video


2009లో కదిరి బాబురావు నామినేషన్ తిరస్కరణ
2009లో కదిరి బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. నాడు బాబురావు నామినేషన్ను దాదాపు ఇదే అభ్యంతరాలతో తిరస్కరించారని టిడిపి నేతలు చెబుతున్నారు. నాడు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కానీ అఫిడవిట్లో సంతకాలు చేయలేదు. అందుకే తిరస్కరించారని అంటున్నారు.

వైసిపి ఏం చెబుతోందంటే
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పైన వైసిపి నేతల వాదన మరోలా ఉంది. అఫిడవిట్ ఉందా లేదా అనేది ముఖ్యం కానీ, నోటరీ ముఖ్యం కాదని వైసిపి నేతలు చెబుతున్నారు. నోటరీ గురించి టిడిపి అభ్యంతరం సరికాదని చెబుతున్నారు.

అసలు ఏం జరిగింది?
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ఫాం 36 అఫిడవిట్లో నోటరి రామతులసి రెడ్డితో సంతకాలు చేయించారు. అయితే నోటరీ రెన్యూవల్ కాలేదు. నోటరీ రెన్యూవల్ కానప్పుడు రామతులసి రెడ్డి సంతకాలు చెల్లవని, అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి అఫిడవిట్ తప్పు అవుతుందని, కాబట్టి ఆయన నామినేషన్ చెల్లదని టిడిపి చెబుతోంది. శిల్పా నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. దీనిని వైసిపి కొట్టి పారేస్తోంది. నోటరీ ముఖ్యం కాదని చెబుతోంది.

శిల్పా నామినేషన్ వర్సెస్ భూమా ఇన్కం ట్యాక్స్
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని టిడిపి నేతలు చెబుతుండగా, వైసిపి నేతలు భూమా బ్రహ్మానంద రెడ్డిని టార్గెట్ చేశారు.

భూమా బ్రహ్మానంద రెడ్డిని ఇలా టార్గెట్
భూమా కుటుంబం ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలును వైసిపి ఎత్తి చూపుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైసిపి కౌంటర్ ఫిర్యాదు చేసింది.

భూమా బ్రహ్మానంద రెడ్డి మరో నోటరీతో
భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా శిల్పా మోహన్ రెడ్డి సంతకాలు చేయించిన నోటరీతోనే కొన్ని ఫైళ్లపై సంతకాలు చేయించారనే ప్రచారం సాగింది. అయితే, భూమా మరో నోటరీతో సంతకాలు చేయించారని చెబుతున్నారు. రెన్యువల్ చేయించుకున్న నోటరీతో సంతకాలు చేయించుకున్నారని చెబుతున్నారు.

ఇప్పుడు ఏమవుతుంది?
వైసిపి చెప్పినట్లు అఫిడవిట్ ముఖ్యం కాదని ఎన్నికల సంఘం భావిస్తే శిల్బా మోహన్ రెడ్డికి ఊరటే అంటున్నారు. అలా కాకుండా అఫిడవిట్లో నోటరీ సంతకం రెన్యూవల్ కూడా ముఖ్యమని భావిస్తే శిల్పాకు షాక్ తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాయి. నోటరీ చెల్లుతుందా లేదా అన్నదే ముఖ్యంగా కనిపిస్తోంది.

ఒత్తిడి కోసమా
నంద్యాలు ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అభ్యర్థులపై మాటల యుద్ధంతో పాటు ఒకరినొకరు మానసికంగాను దెబ్బతీయాలనుకునే వ్యూహంలో భాగంగానే పరస్పరం ఫిర్యాదులు కావొచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications