విజయవాడ:సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పర్యటన...ఎపి-సింగపూర్ ఉమ్మడి సమావేశం
విజయవాడ: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పాటు ఆ దేశపు కన్సార్షియం బృందం కూడా విజయవాడకు విచ్చేసింది.
విజయవాడలో పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఉదయం సింగపూర్-ఏపీ ప్రభుత్వాల ఉమ్మడి స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి స్టార్టప్ ప్రాంతం 'ఫేజ్ జీరో' అభివృద్ధిపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
అయితే గురువారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్-ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య మరోసారి అత్యున్నత స్థాయి జేఐఎస్సీ సమావేశం జరుగనున్నట్లు తెలిసింది. ఆ సమావేశం తరువాత లింగాయపాలెంలో ఫేజ్జీరో ప్రాంతాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సందర్శిస్తారని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సందర్భంగా అక్కడ మంత్రి ఈశ్వరన్తో సమావేశమయ్యారు.
అంతకుముందు నవంబర్ 17, 2017 లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఎపి పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయనతో పాటు సింగపూర్ కన్సార్షియం బృందం వెంట రాగా వారంతా ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని సందర్శించారు. ఇంత తక్కువ సమయంలో సచివాలయాన్ని,అసెంబ్లీని అద్భుతంగా నిర్మించారని ఆసందర్భంగా ఈశ్వరన్ సీఎం ను కొనియాడారు.