మోడీ ఆశీర్వాదం!: బాబుకు సింగపూర్ మంత్రి 'మాస్టర్ ప్లాన్', సీఎంకు ఈశ్వరన్ ప్రశంస
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం సాయంత్రం సింగపూర్ దేశపు వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ సచివాలయంలో భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం మాస్టర్ ప్లాన్ పైన చంద్రబాబుకు ఈశ్వరన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణానికి అవసరమైన బృహత్తర ప్రణాళిక రూపకల్పన, ఇతరత్రా అవసరమైన సాంకేతిక సహకారాల పైన కూడా వారు చర్చించారు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి: చంద్రబాబు
రాజధానిలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని భేటీ అనంతరం చంద్రబాబు చెప్పారు. సింగపూర్, ఏపీ ప్రభుత్వాల ప్రతినిధులతో కమిటీ రాజధానిపై ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ సింగపూర్ ఇస్తుందని చెప్పారు. సింగపూర్ లాంటి రాజధానిని నిర్మిస్తానని తాను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని చెప్పారు. అందుకే మొదటి విదేశీ పర్యటన సింగపూర్ వెళ్లానని తెలిపారు.
మోడీ చెప్పారు...
కేంద్ర ప్రభుత్వంతో విద్యుత్ అవగాహన చేసుకొని కోత లేకుంటే చేశానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి నగరాలను చూడాలని తనకు ప్రధాని మోడీ తిరుపతి సమావేశంలో చెప్పారన్నారు. అందుకనే స్మార్ట్ రాజదాని కట్టాలని చూస్తున్నామన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా రాజధాని స్థిరత్వం సాధించాలన్నారు.
క్వాలిటీకి మారుపేరు సింగపూర్..
సింగపూర్ క్వాలిటీక మారుపేరు అన్నారు. సింగపూర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పారు. ఈ ఎంవోయు ద్వారా ఇప్పటి నుండి పనులు ప్రారంభమవుతాయన్నారు. అవసరమైన మేరకు సింగపూర్ కంపెనీలు జోక్యం చేసుకుంటాయని తెలిపారు.
మన కంపెనీలు కూడా సింగపూర్ కంపెనీలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుంటాయని చెప్పారు. ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ తయారవుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు ఎప్పటికి అప్పుడు కూర్చొని కార్యాచరణ చేస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలు అన్నింటిని ఢిల్లీకి పంపిస్తామని చెప్పారు.
ప్రధానికి కూడా విషయం చెప్పానన్నారు. ఆయన ఆశీర్వచనాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లామన్నారు. రాజధాని విషయమై మాస్టర్ ప్లాన్ తర్వాత చట్టం చేస్తామన్నారు. కొత్త రాజధాని ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని చెప్పారు. సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయన్నారు.
సంతోషంగా ఉంది: ఈశ్వరన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. చంద్రబాబు దూరదృష్టి బాగుందన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పైన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సింగపూర్, ఏపీలు కలిసి పని చేస్తాయని తెలిపారు.
ఏపీ రాజధానిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్, సింగపూర్ మధ్య సోదర సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆరు నెలల్లో బృహత్ ప్రణాళిక ఇవ్వాలని చంద్రబాబు కోరారని, గడువులోగా రాజధాని పైన బృహత్ ప్రణాళిక ఇస్తామన్నారు.