సింగపూర్ రెడీ: జీ-జీ నమూనాలో ఏపీ రాజధాని..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ - ప్రభుత్వం (జీ-జీ) సహకార నమూనాను సింగపూర్ ప్రతిపాదించింది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో సహకారం అందించేందుకు ఆసక్తి కనబర్చింది. ఏపీ కొత్త రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనపరుస్తోంది. ఒక ప్రభుత్వంతో మరో ప్రభుత్వం సహకరించుకునే ప్రాతిపదికపై ఈ పథకాన్ని చేపట్టటానికి సింగపూర్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని ఈ రాజధాని నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రుల ప్రతినిధివర్గం రాజధాని నిర్మాణం, స్మార్ట్ నగరాల నిర్మాణంపై గంటకు పైగా చర్చించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టనున్న స్మార్ట్ నగరాల నిర్మాణంలో కూడా భాగస్వామి కావటానికి సింగపూర్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. సింగపూర్ ప్రతినిధివర్గం చేసిన ప్రతిపాదనలను అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై ఒక నివేదికను అందచేయవలసిందిగా వెంకయ్య అధికారులను ఆదేశించారు.
అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వ ప్రతిపాదనలను విశదీకరించవలసిందిగా ఆదేశించారు. పట్టణాభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల కల్పన, మురుగునీటి పారుదల, రవాణా వ్యవస్థ మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ అంశాలలో సింగపూర్ సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదించి తన నిర్ణయాన్ని తెలియ చేస్తుందని అధికార వర్గాలు చెప్పాయి.
స్మార్ట్ సిటీల నిర్మాణం విధివిధానాలు, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర గురించి మంత్రుల బృందం.. వెంకయ్యను అడిగింది. ఈ నేపథఅయంలో కొత్త రాజధానిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ఆసక్తితో ఉందని వెంకయ్య.. సింగపూర్ ప్రతినిధి బృందానికి చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహకారంపై ఆసక్తి కనబరిచారు. ఒక నమూనాగా నిలిచిపోయేలా కొత్త రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు.