జగన్ కు బ్యాండేజ్ తీసేయమని సునీత సలహా..చిన్న పిల్లలకు ఎంపీ పదవెందుకని ప్రశ్న..!
ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఆయన సోదరి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇవాళ ఆయనకు ఓ సలహా ఇచ్చారు. స్వతహాగా డాక్టర్ అయిన సునీతారెడ్డి జగన్ తన తలకు తగిలిన గాయంపై ఇన్ని రోజులుగా బ్యాండేజ్ వేసుకుని తిరగడం మంచిది కాదని ఆమె సూచించారు. ఓ డాక్టర్ గా చెప్తున్నా ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకోవడం మంచిది కాదు తీసేయమంటూ సునీత అన్నకు సూచించారు.
జగన్ కు వైద్యం చేసిన డాక్టర్లు సరైన సలహా ఇవ్వలేదని, ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని సునీతారెడ్డి తెలిపారు. జగన్ ఇప్పటికైనా త్వరగా బ్యాండేజ్ తీసేయాలని, ఓ డాక్టర్ గా సలహా ఇస్తున్నానని ఆమె తెలిపారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు. తద్వారా తన తండ్రి హంతకులను కాపాడుకున్నందుకు రోజూ తిడుతున్నా అన్నపై అభిమానంతో సునీత ఈ సలహా ఇచ్చినట్లయింది.

మరోవైపు ఇవాళ పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇవాళ జగన్ వ్యాఖ్యల్లో వివేకాపై విద్వేషం కనిపిస్తోందని, ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత కోపం అన్నారు. అలాగే పదే పదే అవినాష్ ను జగన్ చిన్న పిల్లోడిగా సంబోధించడాన్ని సునీత తప్పుబట్టారు. చిన్న పిల్లలకు ఎంపీ పదవులు ఇస్తారా అని జగన్ ను సునీత ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications