చంద్రబాబుకు పోలీస్ రిపోర్ట్ షాక్, గురి తప్పితే ప్రాణం పోయేది!: జగన్కు సిట్ మెమో
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మూడు రోజుల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో పోలీస్ రిపోర్టులో సంచలన నిజాలు ఉన్నట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
Recommended Video
పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వరా? అవమానం: టీడీపీ మూకుమ్మడి దాడి, ఇదీ జగన్ ప్లాన్: లోకేష్
ఈ దాడి ప్రాణాంతకమేనని ఏపీ పోలీసులు తేల్చారని తెలుస్తోంది. కత్తితో దాడి చేసిన శ్రీనివాస రావు తన గురి తప్పితే గొంతుకు తగిలి ఉంటే ప్రాణం పోయి ఉండేదని పోలీస్ రిపోర్టులో ఉందని సమాచారం. కత్తి జగన్ భుజానికి తగలడం అదృష్టమని చెప్పారు.
అసలు నిజం బయటపడింది
ఈ దాడి తీవ్రమైనదిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. దీనిపై ఏపీ పోలీసులతో కాకుండా స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దాడిని తక్కువగా చేసే ప్రయత్నం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోలీసుల రిపోర్టుతో అసలు నిజం బయటపడిందని వైసీపీ నేతలు అంటున్నారు.
పోలీస్ రిపోర్ట్ చంద్రబాబుకు, టీడీపీకి షాక్
పోలీస్ రిపోర్ట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు పెద్ద షాక్ అని అంటున్నారు. ఎందుకంటే చిన్న గాయానికి గవర్నర్, టీఆర్ఎస్ నేతలు, కేంద్రమంత్రి ప్రతిపక్ష నేతను పరామర్శించాలా అని టీడీపీ నేతలు అన్నారు. చంద్రబాబు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు, నిందితుడు జానపల్లి శ్రీనివాస రావుకు టీడీపీ సభ్యత్వం ఉందని, తూర్పు గోదావరి జిల్లాలో కార్డు ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తానెలంక గ్రామం, ముమ్మిడివరం మండలం, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా పేరుతో టీడీపీ సభ్యత్వ కార్డు ఉంది.
జగన్కు మెమో ఇచ్చాం: సిట్ అధికారి
జగన్ పైన దాడి కేసులో సిట్ నిందితుడు శ్రీనివాస రావును ఆదివారం విచారించింది. దాడి వెనుక కారణాలు, ఉద్దేశ్యాలపై పోలీసులు అతనిని ప్రశ్నించారు. విచారణపై సిట్ అధికారి మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్ విచారణకు సహకరిస్తున్నాడని తెలిపారు. నవంబర్ 2వ తేదీ వరకు శ్రీనివాస్ను విచారించేందుకు అనుమతి ఉందని చెప్పారు. జగన్ను ఇప్పటికే సంప్రదించామని, ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదని, ఆయన స్పందన లేకపోవడంతో మెమో ఇచ్చామని చెప్పారు. విచారించాల్సిన వారందరినీ సిట్ విచారణకు పిలుస్తామని తెలిపారు.
జగన్ రక్తనమూనాల్లో ఎక్కువగా అల్యూమినియం శాతం
ఇదిలా ఉండగా, జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉందని వైద్యులు వెల్లడించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు. జగన్ నివాసం లోటస్పాండ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కత్తికి విషం పూసి దాడి చేశాడేమో అనే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్ను సేకరించిన వైద్యులు పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఈ శాంపుల్స్ రిపోర్టు రావడంతో వివరాలు వెల్లడించారు.