కదిలిన డేటా డొంక: ఆధార్ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్/అమరావతి: కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న డేటా చోరీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటా చోరీ వ్యవహారంలో కొందరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసుల విచారణలో మొదట్లో పెద్దగా కదలిక కనిపించలేదు. ఈ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రంగు పులుముకోవడం, ప్రత్యేకించి- ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద తలకాయలకు నేరుగా ప్రమేయం ఉందంటూ వార్తలు రావడంతో విచారణ ముందుకు సాగలేదు.
ఎప్పుడైతే- కేంద్ర ప్రభుత్వ సంస్థ యుఐడీఏఐ (ఆధార్) అధికారులు ఇందులో జోక్యం చేసుకున్నారో.. దర్యాప్తు వేగం పుంజుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇదివరకే ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితుల వేట ముమ్మరం చేసింది. చోరీకి గురైనట్లు భావిస్తోన్న ఏడు కోట్ల 58 లక్షల మంది వ్యక్తిగత సమాచారం తమ వద్ద డేటా బేస్ తో సరిపోలినట్లు ఏకంగా ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ భవానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
పోలింగ్ కు 48 గంటలు: మాజీ ప్రధాని బంధువునూ వదల్లేదు: తెల్లవారుజాము నుంచే ఐటీ దాడులు
అశోక్ కోసం వేట..
డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. దీనికోసం సిట్ అధికారులు త్వరలో ఏపీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. అశోక్ ను అరెస్టు చేయడానికి తెలంగాణ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు ఏపీకి వెళ్లినట్లు చెబుతున్నారు. నిజానికి- డేటా చోరీ ఐటీ గ్రిడ్ కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినా అశోక్ విచారణకు హాజరుకాకపోవడంతో తప్పనిసరి సరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని సిట్ నిర్ణయించింది.
డేటా చోరీ నిజమే: ఫోరెన్సిక్ నివేదిక
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్నందున ఇన్నాళ్లూ సిట్ అధికారులు మిన్నకుండిపోయారు. ఎన్నికలు ముగియడంతో పాటు.. ఆధార్ అధికారులు కూడా కేసు నమోదు చేయడంతో దర్యాప్తులో దూకుడు పెంచారు. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ను తెలంగాణ ఫోరెన్సిక్ లాబొరేటరీ అధికారులు విశ్లేషించారు. కోట్ల సంఖ్యలో ఆధార్ సమాచారం అందులో నిక్షిప్తమై ఉన్నట్లు తేలింది. తాజాగా- ఫోరెన్సిక్ నివేదిక కూడా సిట్ చేతికి అందింది. నేరం జరిగినట్లు తేలడంతో అశోక్ కోసం వేట ముమ్మరం చేశారు.
హార్డ్ డిస్క్ తో బండారం బట్టబయలు..
ఐటీ గ్రిడ్స్ సంస్థలో సోదాల సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లలో ఏడు కోట్ల 58 లక్షల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు ఫోరెన్సిక్ నిర్ధారించింది. అవన్నీ ఏపీ, తెలంగాణకు సంబంధించిన డేటాగా తన నివేదికలో స్పష్టం చేసింది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్స్ (ఎస్ఆర్డీఏఐ)లో మాత్రమే అతి భద్రంగా ఉండాల్సిన వ్యక్తిగత వివరాలు కోట్ల సంఖ్యలో ఓ ప్రైవేటు సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంస్థే తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ సేవా మిత్రను రూపొందించిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆధార్ సంస్థ కూడా ఫిర్యాదు చేయాలని సిట్ అధికారులు ఢిల్లీలోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయ అధికారులకు ఒక లేఖలో సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఆధార్ అధికారులు నాలుగు రోజుల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.