నక్సలైట్గా మారేందుకు అనుమతించండి- రాష్ట్రపతికి సీతానగరం శిరోముండనం బాధితుడి లేఖ..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పోలీసుల చేతిలో శిరోముండనానికి గురైన యువకుడు వరప్రసాద్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు తాజాగా ఓ లేఖ రాశారు. తనను శిరోముండనం చేసిన పోలీసులపై ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన వరప్రసాద్ రాష్టపతి అనుమతిస్తే నక్సలైట్గా మారతానని కోరడం కలకలం రేపుతోంది. విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడంతో అతను ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై విపక్ష నేత చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు.
ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు..
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియా అక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రశ్నించినందుకు స్ధానిక వైసీపీ నేతల ప్రమేయంతో పోలీసులు మునికూడలికి చెందిన దళిత యువకుడు వరప్రసాద్ను స్టేషన్లోనే శిరోముండనం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్ంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం కారకులైన పోలీసు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసింది. అయితే దర్యాప్తు పూర్తి కానందున ఇంకా వీరిపై తదుపరి చర్యలు తీసుకోలేదు. దీనిపై బాధితుడు వరప్రసాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
నక్సలైట్ అవుతానంటూ రాష్ట్రపతికి లేఖ
ఈ నేపథ్యంలోనే తాను సమాజంలో గౌరవంగా బతికేందుకు వీలుగా నక్సలైట్గా మారేందుకు అనుమతించాలంటూ బాధితుడు వరప్రసాద్ తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు లేఖ రాశాడు. ఈ లేఖతో పాటు అప్పటి శిరోముండనం వీడియోను సైతం జతచేసి ఈ మెయిల్ ద్వారా రాష్ట్రపతికి పంపాడు. ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు పోలీసులతో కొందరు స్ధానిక నేతలు కుమ్మక్కై స్టేషన్లోనే తనను శిరోముండనం చేయించారని, వీరిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో అతను ఆరోపించాడు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో వైసీపీ నేతల పాత్ర ఉన్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అధికార పార్టీ కావడంతో వీరిపై చర్యలు తీసుకోవడం లేదని వరప్రసాద్ చెబుతున్నాడు.
Recommended Video
చంద్రబాబు, లోకేష్ స్పందన...
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మునికూడలిలో దళిత యువకుడిని శిరోముండనం చేయించిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ కూడా తప్పుబట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత యువకుడికి నక్సలైట్గా మారాలన్న ఆలోచన వచ్చిందంటే రాష్ట్రంలో వ్యవస్ధలు ఏ విధంగా దిగజారాయో ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. లోకేష్ కూడా వరప్రసాద్ లేఖపై స్పందిస్తూ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. దీనిపై ఇప్పటికే జాతీయ మానవహక్కుల కమిషన్కు టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది.