ఎపి రాజధాని: ఖర్చులో పొంతన లేని అంచనాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనాలో శివరామకృష్ణన్ కమిటీ అంచనాకు, రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు మధ్య పొంతన కుదరడం లేదు. శివరామకృష్ణన్ కమిటీ అంచనాకు రెండింతల అంచనాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతోంది.
రాజధానిలో సచివాలయం, శాసనసభ, ఇతర ప్రధాన భవనాల నిర్మాణానికి 7 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని శివరామకృష్ణన్ కమిటీ అంచనా వేసింది. ఆయన రాష్ట్ర కమిటీ మాత్రం 14 వేల కోట్లు ఖర్చవుతుందని చెబుతోంది.
రోడ్లు, నీరు, విద్యుచ్ఛక్తి, డ్రైనైజీ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు 6,400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని శివరామకృష్ణన్ కమిటీ భావిస్తుండగా రాష్ట్ర కమిటీ మాత్రం 16 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
రాజభవన్, అతిథి గృహాలు, మంత్రులకూ ఇతరులకూ నివాస క్వార్టర్ల నిర్మాణానికి 55 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అంచనా వేస్తోంది. అయితే, శివరామకృష్ణన్ కమిటీ మాత్రం రాజభవన్, ఇతర భవనాల నిర్మాణం గురించి తన నివేదికలో ప్రస్తావించలేదని సమాచారం.
అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరకు సంబంధించిన ఖర్చును కమిటీ ప్రస్తావించలేదు. ఇందుకు 20 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర కమిటీ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మాదిరిగా కృష్ణా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీనికి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చువుతాయని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నారాయణ కమిటీ అంచనా వేసింది. శివరామకృష్ణన్ కమిటీలో దాని ప్రస్తావన లేదు.
కృష్ణా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద కృష్ణా నదికి ఇరువైపులా విజయవాడ పరిధిలో గార్డెన్స్, ప్రోమెనేడ్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు, వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలు తదితరాలు ఏర్పాటు చేస్తారు. నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే వారి కోసం ఇళ్ల నిర్మాణం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.
విజయవాడ - గుంటూరు - తెనాలిలను కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం రింగ్ రోడ్డును ప్రతిపాదించింది. ఇందుకు 19,700 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.