రాజధానిపై కమిటీ రిపోర్ట్ సిద్ధం, ఎక్కడనేది కాకుండా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో పలు దఫాలుగా పర్యటించిన కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది.
రాజధానికి అనుకూలమైన ప్రాంతాలు, ప్రతికూలతలను అందులో సమగ్రంగా వివరిస్తుంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అందిన వెంటనే దానిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిస్తుంది. కమిటీ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకోనుంది.
శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎక్కడ అనే విషయంలో పలు ఆప్షన్లు ఇచ్చింది. అందులో ఆయా ప్రాంతాల సానుకూల, ప్రతికూలతలను పేర్కొంది. రాజధాని ఎక్కడ అన్నది ప్రత్యేకంగా ఏ ప్రదేశాన్ని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలే పేర్కొనలేదు.
కాగా, శివరామకృష్ణన్ తన నివేదికను ఈ రోజు సాయంత్రం గానీ లేదా రేపు ఉదయం గానీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేయనుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నాలుగైదు ప్రదేశాలను కమిటీ సూచించిందని అంటున్నారు.