ఫ్యామిలీలోని 6గురి ఆత్మహత్య, విద్యార్థినికి వేధింపులు
కడప/హైదరాబాద్: కడప జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలోని చక్రాయపేట మండలం గండిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వారిగా భావిస్తున్నారు. గండిలోని ఏపీ టూరిజం హోటల్లో వీరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో దంపతులు, పిల్లలు ఉన్నారు.
విద్యార్థినికి లైంగిక వేధింపులు
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. లేపాక్షి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడికి బడితెపూజ చేశారు. ఉపాధ్యాయుడ్ని స్కూల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాహితను వేధించిన వ్యక్తి అరెస్ట్
వివాహితను వేధిస్తున్న ఓ కార్పోరేట్ ఉద్యోగిని హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్న హుసేన్ గచ్చిబౌలిలోని ఓ కార్పోరేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇంటికి సమీపంలో ఉంటున్న వివాహితను పరిచయం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమె, కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడటం చేసేవాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది.