సీఎస్ ఆదిత్యనాథ్ ఆరునెలలు పొడిగింపు- కేంద్రం ఆమోదం- వద్దంటూ టీడీపీ లేఖ
ఈ నెలాఖరుతో రిటైర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. దీంతో ఆయన మరో ఆరునెలల పాటు అదనపు పదవీకాలం పొందబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ సేవల్ని మరికొంతకాలం వాడుకోవాలని సీఎం జగన్ భావించడంతో ఆయనకు ఎక్స్టెన్షన్ దక్కింది. తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.

నెలాఖరుతో సీఎస్ ఆదిత్యనాథ్ రిటైర్
గతేడాది డిసెంబర్ 31న ఏపీ సీఎస్గా ఉన్న నీలం సాహ్నీ పదవీ విరమణ చేయడంతో ఆమె స్ధానంలో ఆదిత్యనాథ్ దాస్ సీఎస్గా బాద్యతలు చేపట్టారు. జనవరి 1 నుంచి ఆయన పదవీకాలం అమల్లోకి వచ్చింది. అయితే ఆయన ఈ నెల 30వ తేదీతో రిటైర్ కానున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపిక కంటే ఆయన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ కుటుంబానికి విధేయుడు కావడం, సీఎం జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు ఆరునెలలు పొడిగింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. సీఎం జగన్ మొన్నటి ఢిల్లీ పర్యటనలోనూ హోంమంత్రి అమిత్షాను ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

ఆదిత్యనాధ్ పదవీకాలం ఆరునెలల పొడిగింపు
సీఎస్గా ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలాన్ని ఆరునెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ మరో ఆరు నెలల పాటు సీఎస్గా కొనసాగేందుకు అవకాశం దక్కింది. సీఎస్గా బాధ్యతలు చేపట్టాక ఆరునెలల పదవీకాలమే ఉండటంతో ఆదిత్యనాథ్ దాస్కు పొడిగింపు ఇస్తారని అప్పుడే అంతా భావించారు. అనుకున్నట్లుగానే సీఎం జగన్ ఆయన పదవీకాలం పొడిగింపును సాధించుకున్నారు.

మూడు నెలల చొప్పన పొడిగింపు
సీఎస్గా ఆదిత్యనాధ్ దాస్ ఈ నెలాఖరున రిటైర్ కానున్నందున ఆ తర్వాత ఆరునెలల పదవీకాలం పొడిగింపు అమల్లోకి వస్తుంది. అయితే తొలుత మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తర్వాత మరో మూడు నెలల ఎక్స్టెన్షన్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలశాఖ నిబంధనల మేరకు ఈ పొడిగింపు మూడు నెలల చొప్పున అమల్లోకి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ సీఎస్గా ఆధిత్యనాధ్ దాస్ కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

పొడిగింపు వద్దంటూ కేంద్రానికి టీడీపీ లేఖ
ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింవద్దని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు లేఖ రాశారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్ నిందితునిగా ఉన్నారని, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి సీఎం జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సాయం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయి అయిన ఇండియా సిమెంట్స్కు లిమిటెడ్కు నిబంధనలకు విరుద్ధంగా పది లక్షల లీటర్ల నీటికి కేటాయించారన్నారు. ఇలాంటి వ్యక్తిని అదే పదవిలో కొనసాగిస్తే ప్రజావ్యవస్థలపై నమ్మకం పోతుందని, అలాగే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు.












Click it and Unblock the Notifications