Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ సంగతి:కప్పల కోసం పాముల పాట్లు...అందుకే మనుషులకు కాట్లు

కృష్ణా జిల్లా:ఇటీవల భారీ వర్షాల సమయంలో లంకల గ్రామాల్లో మనుషులను పాములు కాట్లు వేస్తున్న ఘటనలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వర్షాలు ఆగిపోయి రోజులు గడుస్తున్నా పాముల కాట్లు కొనసాగుతూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో ప్రజల్లో పాముల కాట్లపై విపరీతమైన భయాందోళనలు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం సైతం ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడింది. పాముల కాట్లపై ప్రజలు వివిధ రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి వినతి మేరకు ప్రభుత్వమే ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పండితులతో 'సర్ప శాంతి యాగం' జరిపించింది. అయినా పాముల కాట్లు నమోదవుతూనే ఉన్నాయి. అయితే పాములు ఇంతలా రెచ్చిపోయి మనుషులను కాటు వేయడానికి కారణం వేరే ఉందంటూ ఇక్కడి జంతు ప్రేమికులు వెల్లడించిన ఒక విషయం సంచలనం సృష్టిస్తోంది. అదేమిటంటే?...

పాములు...కక్ష గట్టినట్లు

పాములు...కక్ష గట్టినట్లు

కృష్ణా జిల్లాలోని దివిసీమతో సహా వివిధ లంకల గ్రామాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న పాముకాట్లతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. పాములు పగబట్టినట్లు కూడా కాదు...ఏకంగా కక్ష గట్టినట్లు మనుషులను కసిదీరా కాటువేస్తుండటమే ఇందుకు కారణం. గతంలో ఎన్నడూలేని విధంగా ఇలా పాములు ఈ స్థాయిలో కాటు వేస్తుండటంపై బెంబేలెత్తిన జనాలు అధికారులకు మొరపెట్టుకోగా వారు కూడా ఏం చెయ్యాలో తోచక చేతులెత్తేశారట. దీంతో జనాలే తమని దేవుడే కాపాడాలని ఒక నిర్ణయానికొచ్చి సర్ప శాంతి యాగం చేయించమని కోరారట.

ప్రభుత్వం ఆధ్వర్యంలో...సర్పశాంతి యాగం

ప్రభుత్వం ఆధ్వర్యంలో...సర్పశాంతి యాగం

పాముల కాట్లను నివారించే మార్గం కనిపించకపోవడంతో ప్రభుత్వం ప్రజలు కోరిన విధంగా పాములను శాంతింపజేసేందుకు 'సర్ప శాంతి యాగం' కు పూనుకుంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరాన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇటీవల 17 మంది పండితులు 'సర్ప శాంతి యాగం' ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజా సంఘాల నుంచి విమర్శలు వస్తాయని తెలిసినా వెరవలేదు. కారణం ప్రజాహితమే తమ అభిమతమని చెప్పొచ్చనే ధీమాగా అర్థం చేసుకోవచ్చు.

ఇదీ...అసలు సంగతి!

ఇదీ...అసలు సంగతి!

అయితే పాములు ఎందుకిలా చేస్తున్నాయని పరిశీలించిన జంతు ప్రేమికులకు ఆ తరువాత అసలు విషయం అర్థమయిందట. అదేమిటంటే?...పాములకు ప్రధాన ఆహారమైన కప్పలు దొరకక...కడుపు నిండక ఆకలితో రగిలిపోతున్న పాములు ఆహారం కోసం అన్వేషిస్తూ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయట. ఆ క్రమంలో తమకు ఎదురైన మనుషులను కసితీరా కాటేస్తున్నాయట. అసలే వరద నీటికి భారీ సంఖ్యలో కొట్టుకొచ్చిన పాములు...ముందే కొరతగా ఉన్న కప్పలు...దీంతో ఎలుకల వంటి వాటితో నైనా కడుపునింపుకునేందుకు పొలాల్లోకి జనావాసాల్లోకి వెదుక్కొంటూ వచ్చేస్తున్న ఈ పాముల బారిన పడి వాటి కాట్లకు గురవుతున్నారు స్థానికులు.

కప్పలు...ఎందుకు కరువయ్యాయంటే?...

కప్పలు...ఎందుకు కరువయ్యాయంటే?...

ఇక్కడి స్థానికుల్లో కొందరు కొంతకాలం నుంచి కప్పలను అక్రమంగా వేటాడి వాటిని వ్యాపారులకు విక్రయిస్తే వారు వీటిని చైనాకు ఎగుమతి చేస్తున్నారట. వ్యాపారులు ఈ కప్పలకు భారీ మొత్తాలే ముట్టజెబుతుండటంతో స్థానికులు చెట్లుపుట్టలు, పొలాలు, ఇతర ప్రదేశాలు గాలించి మరీ కప్పలను వేటాడుతున్నారట. ఇలా వేటాడిన కప్పల రెండు కాళ్లు, తల తొలగించి ఐస్ బాక్సుల్లో ప్యాక్ చేసి కోల్ కతా మీదుగా చైనాకి పంపుతున్నారని తెలిసింది. బుల్ ఫ్రాగ్, ఇండియన్ స్కిప్పర్, ఎల్లో ఇండియన్ ఫ్రాగ్, సదరన్ క్రికెట్ ఫ్రాగ్/ఇండియన్ క్రికెట్ ఫ్రాగ్ వంటి వివిధ రకాల కప్పలు, అరుదైన జాతి కప్పలు ఈ అక్రమ వ్యాపారం కారణంగా కనుమరుగయ్యే స్థితికి వచ్చేశాయి. దీంతో అసలు దివిసీమలోనే దాదాపుగా కప్పలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది.

దివిసీమ...మరోసారి వార్తల్లోకి

దివిసీమ...మరోసారి వార్తల్లోకి

1977లో వచ్చిన పెను ఉప్పెన కారణంగా దివిసీమ జాతీయస్థాయిలో వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఆ జలప్రళయంలో సుమారు పదివేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. అయితే తాజాగా ఈ పాముల దాడులతో దివిసీమ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. 708.80 చ.కి.మీల విస్తీర్ణం ఉన్న ఈ దివిసీమలో 194.8 చ.కి.మీల విస్తీర్ణంలో దట్టమైన మడ అడవులు ఉన్నాయి. ఇవి అరుదైన జీవజాతులకు నెలవుగా ఉండటంతో దీనిని కృష్ణా అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏటా వర్షాకాలంలో కృష్ణానది వరదనీరు ఇక్కడి పంటపొలాలను,నివాసాల ముంచెత్తడం సాధారణమే. ఆ క్రమంలో అడవులు, నదీతీరం వెంబడి ప్రాంతాల్లో పాముల బెడదా సహజమే. అయితే ఇప్పుడు మాత్రం కప్పల కొరత కారణంగా దివిసీమ అంతటా పాములు బుసలు కొడుతూ...కాటేస్తూ జనాల్నిబెంబేలెత్తిస్తున్నాయి.

మనుషులకు...పాములకు...బెడద

మనుషులకు...పాములకు...బెడద

దీంతో తమకు ప్రధాన ఆహారమైన కప్పల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఆహారం అన్వేషణలో భాగంగా పాములు పంటపొలాలు, జనావాసాల్లోకి భారీ సంఖ్యలో చొరబడుతున్నాయి. ఈ క్రమంలో వాటికి ఎదురైనవారిని కోపంతోనో, భయంతోనో కాటు వేస్తున్నాయి. అలా రోజురోజుకి పాముకాట్లు ఎక్కువ కావడంతో స్థానికులు కూడా ప్రత్యేకంగా పాములపై దృష్టి పెట్టి మరీ చంపుతున్నారు. దీంతో పాముల వల్ల మనుషులకు...మనుషుల వల్ల పాములకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై ఈ కోణంలో దృష్టి పెట్టి అటు కప్పలను కాపాడటం ద్వారా ప్రకృతి సమతుల్యం దెబ్బతినకుండా చూడాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+