రోజాపై సోషల్ మీడియా ప్రశంసలు జల్లు: ఎందుకంటే..
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తన మంచి మనసును చాటుకుని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువతిని ఎమ్మెల్యే రోజా ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. దీంతో ఆ మహిళ కుటుంబసభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాక, ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో రోజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. యాదమరి మండలం ముత్తరపల్లెకు చెందిన సింధు(25) శుక్రవారం స్కూటీలో చిత్తూరు నుంచి తిరుపతి ఎస్వీయూకు బయలుదేరి వెళ్లింది.
నేండ్రగుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆమె స్కూటీని ఢీకొని వెళ్ళిపోయింది. దీంతో తలకు బలమైన గాయాలతో సింధు రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయింది.

కాగా, అదే సమయంలో చిత్తూరులో జరిగే జడ్పీ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్యే రోజా ఆమెను గుర్తించింది. సింధును వాహనంలో పూతలపట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. సకాలంలో తీసుకొని రావడంతో యువతికి ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. సింధు తల్లిదండ్రులు రోజాకు కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను స్విమ్స్కు తరలించారు.
ఇదే విషయంపై సోషల్ మీడియాలో రోజాపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. నేండ్రగుంట-చిత్తూరు మార్గంలో 27 కి.మీ. మేర ఎక్కడా ముఖ్యమైన ఆస్పత్రులు లేవన్నారు. దీంతో ప్రమాదాలు జరిగితే వాహనదారుల ప్రాణాలు పోతున్నాయనీ, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications