కుప్పం టీడీపీ నేత ఇంటిపై రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి: విధ్వంసం అంటూ చంద్రబాబు ఫైర్
చిత్తూరు: కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ ఆర్ఆర్ రవి ఇంటిపై దుండగుల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అర్ధరాత్రి సమయంలో టీడీపీ నేత ఇంటిపై మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై మండిపడ్డారు.
రవి ఇంటిపై దాడి ఘటనపై చంద్రబాబు కుప్పం పార్టీ నేతలతో మాట్లాడారు. ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కొద్ది కాలంగా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, దాడికి రెండు గంటల ముందు కూడా ఫోన్ చేసి రవిని బెదిరించినట్లు స్థానిక నేతలు చంద్రబాబుకు వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో టీడీపీ సీనియర్ నేత, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ ఆర్ఆర్ రవి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి చేశారు. కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇవ్వాలంటూ రెస్కో ఛైర్మన్, వైసీపీ నేత సెంథిల్ సోమవారం రాత్రి 10.45 గంటల సమయంలో రవికి ఫోన్ చేయగా.. అవి తన వద్ద లేవని చెప్పారు.
దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించామని ఆయన తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి కొంతమంది వైసీపీ కార్యకర్తలు కుప్పం నేతాజీ రోడ్డులోని రవి ఇంటిపై మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, టీడీపీ హయాంలో గంగమ్మ గుడికి సంబంధించి రూ. 96 లక్షలు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ బాండ్లు ఇవ్వాలంటూ వారం రోజులుగా వైసీపీ నేతలు రవిని అడుగుతున్నారని, అవి తన వద్ద లేవని చెప్పినా వినకుండా ఆయనపై ఇంటిపై దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.