క్వారెంటైన్ కష్టాలు.. ఇలా అయితే ఎలా.. ఏపీ ప్రభుత్వానికి కొత్త సవాళ్లు..
కరోనా విపత్తును ఎదుర్కోవడానికి అంతా ఐక్యంగా ఉండాల్సిన సందర్భమిది. ప్రభుత్వ చర్యలకు సహకరిస్తూ ఇళ్లకే పరిమితం కావాల్సిన పీరియడ్ ఇది. కానీ ఏపీలో పలుచోట్ల కొంతమంది గ్రామస్తులు రోడ్డెక్కుతున్నారు. తమ గ్రామాల్లో క్వారెంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేస్తున్నారు. అయితే వీళ్ల లాగే రాష్ట్రంలో ప్రతీ గ్రామం,పట్టణం తమ వద్ద క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దంటే కుదురుతుందా.. కరోనాను కలిసి ఎదుర్కోవాల్సిన తరుణంలో.. ప్రభుత్వ చర్యలకు సహకరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
క్వారెంటైన్ ఏర్పాట్లకు కష్టాలు.. అడ్డుకున్న గ్రామస్తులు..
కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ఉన్న చైతన్య స్కూల్లో ప్రభుత్వం క్వారెంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే తమ గ్రామంలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని గ్రామస్తులు నిరసిస్తున్నారు. దాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం(మార్చి 25)న ఆందోళనకు దిగారు. ఎవరినీ లోపలికి వెళ్లనివ్వకుండా స్కూల్ గేట్లకు తాళం వేశారు. అయితే అనుమానిత పేషెంట్స్ను మాత్రమే క్వారెంటైన్లో ఉంచుతామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఎస్ఐ షణ్మఖ సాయి వారికి నచ్చజెప్పారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదని తెలుస్తోంది. తమ నివాసాలకు సమీపంలో క్వారెంటైన్ ఏర్పాటు చేస్తే తమకు ప్రమాదమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఆ గ్రామంలోనూ ఇదే పరిస్థితి..
కృష్ణా జిల్లాలోని పెడన మండలం నందమూరులోనూ ఇదే జరిగింది. గ్రామ శివారులోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అధికారులు చెప్తే వినట్లేదని.. మంగళవారం రాత్రి వేళ కాలేజీ వద్దకు వెళ్లి బీభత్సం సృష్టించారు. దీంతో అధికారులే హడలిపోయారు. చేసేది లేక.. ఐసోలేషన్ వార్డును అక్కడినుంచి తరలిస్తామని చెప్పారు. అప్పుడు గానీ గ్రామస్తులు శాంతించలేదు. ఇలా ఒకరిని చూసి ఒకరు.. ఇతర గ్రామస్తులు కూడా ఇలాగే చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. కరోనా నియంత్రణ చర్యలతో పాటు ఇలా గ్రామస్తులకు నచ్చజెప్పడం,అవగాహన కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాల్గా మారింది.
Recommended Video
ఏపీలో మొత్తం 10 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. బుధవారం శ్రీకాళహస్తితో పాటు గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఇదే మొదటి కేసు కావడం గమనార్హం. పట్టణంలోని మంగళ్దాస్నగర్కి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 19న అతను ఢిల్లీ నుంచి గుంటూరు వచ్చినట్టు గుర్తించారు. అతనితో కలిసినవారి వివరాలను కూడా అధికారులు సేకరించే పనిలో పడ్డారు. ఇక తెలంగాణ నుంచి ఏపీకి బయలుదేరిన విద్యార్థులను క్వారెంటైన్కు తరలిస్తున్నారు. క్వారెంటైన్ తర్వాతే వారిని స్వస్థలాలకు అనుమతించనున్నారు. అయితే ఇకపై ఎవరినీ తెలంగాణ నుంచి ఏపీకి పంపించవద్దని.. ఎక్కడి వారిని అక్కడే ఉండనిద్దామని ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక అవగాహనకు వచ్చారు.