మళ్లీ ముక్కలు చేస్తారా?, ఏపీకి జగన్ ద్రోహం: బీజేపీ, మోడీపై సోమిరెడ్డి నిప్పులు
అమరావతి: భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ విప్ కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
గత బడ్జెట్ సమావేశాల నాటి నుంచి బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి సోమిరెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు.
మరోసారి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?
బీజేపీ రాష్ట్రాన్ని మళ్లీ విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒక ఓటుకు రెండు రాష్ట్రాల సిద్దాంతాన్ని బీజేపీ మళ్లీ తెర మీదకు తెస్తోందని సోమిరెడ్డి దుయ్యబట్టారు. తాము చెప్పినట్టు చేయకుంటే రాష్ట్రాన్ని విడదీస్తామన్నట్టుగా బీజేపీ మాట్లాడుతోందని అన్నారు.
పార్లమెంటులో నిరసనలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రిన్స్ మహేష్ మేనల్లుడు, హోదా నినాదాలు
జగన్ పార్టీ తీరిది.. బాబంటే తప్పేంటి?
మోడీపై విశ్వాసం, మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం... ఇదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు అంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేగాక, ఆర్ధిక నేరగాళ్లకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే నీరవ్ మోడీకి కూడా ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఉత్తర, దక్షిణ భారతదేశం అనడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపొద్దని మాత్రమే తాము కోరుతున్నామని సోమిరెడ్డి అన్నారు.
బాబు రాత్రింబవళ్లు..
ఇది ఇలా ఉండగా, శాసనసభలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్రాన్ని విభజించారు. విభజన తర్వాత పురిటిబిడ్డగా ఉన్న ఏపీకి ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లి 114 పేజీలతో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. మా హక్కులు కాపాడండి.. విభజన హామీలు నెరవేర్చండి అని కోరుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు. చట్టంలోని 18 అంశాలు, ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే' అని కూన రవికుమార్ అన్నారు.
జగన్ ద్వంద్వ వైఖరి..
ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడీపై విశ్వాసం ఉందని ఆ పార్టీ ఎంపీ చెబితే.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ చెబుతున్నారని.. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అని రవికుమార్ ప్రశ్నించారు.