రోజా! నోరు దగ్గర పెట్టుకో, చంద్రబాబుకు అంత సామర్థ్యం లేదు: సోమిరెడ్డి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం ధ్వజమెత్తారు. రోజా ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన రోజా విమర్శలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు లక్ష కోట్లు సంపాదించుకునే సామర్థ్యం లేదని చెప్పారు. ప్రజాభిమానం, రెండంకెల వృద్ధి రేటు చంద్రబాబు లక్ష్యమని చెప్పారు.
రోజుకు 24 గంటలూ కష్టపడే చరిత్ర, సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని సోమిరెడ్డి అన్నారు. వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిది మాత్రం ప్రతి వారం నాంపల్లి టు సుప్రీం కోర్టుకు తిరిగే చరిత్ర అని ఎద్దేవా చేశారు. కాగా, మూడు రోజుల క్రితం వైయసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

కూరగాయల రథాన్ని ప్రారంభించిన చంద్రబాబు
తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదానం పథకం కోసం విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు అనే వ్యక్తి 8 టన్నుల కూరగాయలను సేకరించారు. వీటన్నింటిని తిరుమలకు చేర్చేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కూరగాయల రథాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు.
ఇసుక విధానాన్ని ఖరారు చేసిన ఏపీ సబ్ కమిటీ
ఆరు జిల్లాల్లో ఇసుక టెండర్లను నిలిపివేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సోమవారం విజయాడలో జరిగిన భేటీలో పలు అంశాలను చర్చించారు. రాక్ శాండ్ విధానాన్ని ఖరారు చేశారు. సబ్ కమిటీలో తీర్మానం చేసిన అంశాలను కేబినెట్కు పంపిస్తామని, ఆయా అంశాలను పరిశీలించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.












Click it and Unblock the Notifications