భారీ కుంభకోణం: ఏపీ ఇళ్ల నిర్మాణంలో రూ.30వేల కోట్లు అవినీతి జరిగిందన్న సోమువీర్రాజు
ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని విమర్శించారు ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం రూ.4వేల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.1400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో రూ.30వేల కోట్లు అవినీతి జరిగిందని వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలుగు దేశ ప్రభుత్వం చెబుతున్న ఇళ్ల సంఖ్యకు, నిర్మించినవాటికి పొంతన లేకుండా ఉందని ఆయన ఆరోపించారు. అవసరం లేకున్నప్పటికీ బ్యాంకులనుంచి అప్పులు తీసుకుని ఆ భారాన్ని ప్రజలపై చంద్రబాబు సర్కార్ మోపుతోందని మండిపడ్డారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే ఏపీకి 7 లక్షల ఇళ్లు వచ్చాయన్నారు. ఒక ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు సరిపోతుందన్న సోము... కేంద్ర రాష్ట్ర నిధులు రూ. .50 లక్షలు , రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2.65 లక్షలు అప్పు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
నీరు చెట్టు కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రతి ఏరియాల్లో ఇసుక రీచ్లలో అవినీతి జరుగుతోందన్నారు. సర్వశిక్ష అభియాన్లో ఓ కొత్త టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టారని అందులో కూడా అవినీతి చాలా మేనేజ్డ్గా జరుగుతోందని విమర్శించారు. నాణ్యమైన విద్యను కేంద్రం అందించాలని చూస్తోంటే... రాష్ట్రంలో విద్య అంతా నారాయణ నారాయణ అంటోందని మంత్రి నారాయణ విద్యాసంస్థలను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.