పవన్ కళ్యాణ్ "ఒక్కఛాన్స్" నినాదానికి మద్దతిస్తాం-సోము వీర్రాజు ప్రకటన...
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ కు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు పవన్ విశాఖ పర్యటన తర్వాత రాజకీయమంతా ఆయన చుట్టే తిరుగుతోంది. దీంతో పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు అటు చంద్రబాబు, ఇటు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
విశాఖలో మోడీ టూర్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ స్పందించారు. విశాఖను రాజధాని చేస్తామంటున్న వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, కానీ ప్రధాని మోడీ వచ్చి 15 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించి వెళ్లారన్నారు. విశాఖలో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగడం లేదన్నారు. తమ మిత్రపక్షం జనసేన జగనన్న కాలనీల సోషల్ ఆడిట్ నిర్వహిస్తుంటే వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.

జగన్ గతంలో ఒక్క ఛాన్స్ అన్నారని, చంద్రబాబు తనకు లాస్ట్ ఛాన్స్ అంటున్నారని, కానీ తమ మిత్రపక్ష నేత పవన్ కళ్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగితే దాన్ని బీజేపీ సమర్ధిస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు.
రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ.. టీడీపీతో కలిసి వెళ్లకుండా బీజేపీ-జనసేన మాత్రమే కలిసి పనిచేసేలా రోడ్ మ్యాప్ ఇచ్చారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భవిష్యత్తులో జనసేన బలపడబోతోందన్న సూచనలతో బీజేపీ ఆ పార్టీతోనే కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు, పవన్ ను సీఎం చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications