పవన్! టిడిపిని నిలదీయవెందుకు?: సీఆర్, ‘కోరితే మోడీతో భేటీ’
విశాఖపట్నం: తిరుపతి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు స్పందించారు. బిజెపిపై పవన్ ఆ సభలో కొంత ఘాటుగానే వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
కాగా, పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... అతని వ్యాఖ్యలతో తాము విభేదించటం లేదని అన్నారు. పవన్ కోరితే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేగాక, ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మంత్రి గంటా కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రత్యేక హోదాపై పవన్ పోరాటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రజల అభిప్రాయాన్నే పవన్ చెప్పారని మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఆరాటాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారని మంత్రి గంటా తెలిపారు.

టిడిపిని నిలదీయవెందుకు?: సీఆర్
కడప: పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీని ఎందుకు నిలదీయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆదివారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై పవన్ విమర్శలు చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన పవన్.. గతం తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీయేనని రామచంద్రయ్య గుర్తు చేశారు.
పవన్ అవగాహన రాహిత్యంతోనే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చిత్తశుద్ధితోనే ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని, రాష్ట్ర విభజనకు బిజెపి, టిడిపిలు కూడా సహకరించాయని, ఆ పార్టీలను కూడా పవన్ ప్రశ్నించాలన్నారు.












Click it and Unblock the Notifications