వైసీపీకి ఓటేసిందని తల్లిని సుత్తితో కొట్టి చంపిన తనయుడు; అనంతపురంలో దారుణం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకుంటున్న విషాద ఘటనలు అన్ని ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ తరువాత కూడా వైసిపి, టిడిపి మధ్య దాడుల పర్వం కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో జరుగుతున్న గొడవలు, దారుణాలు అక్కడ రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
తల్లిని హతమార్చిన తనయుడు
ఇదిలా ఉంటే ఏపీలో తాజాగా ఎన్నికలలో వైసిపికి ఓటు వేసినందుకు కన్నతల్లిని తనయుడు దారుణంగా హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే కంబదూరు మండలం ఎగువపల్లిలో తల్లి వైసీపీకి ఓటు వేయడంతో విచక్షణ మరిచిన కన్న కొడుకు తల్లిని సుత్తితో కొట్టి హత మార్చాడు.

వైసీపీ ఓటు వేసినందుకు గొడవ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు తల్లితో గొడవ పెట్టుకున్న తనయుడు మద్యం మత్తులో తల్లిని హతమార్చి అక్కడి నుండి పరారయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా టిడిపి కోసం పనిచేస్తున్న వడ్డే వెంకటేశులు తల్లి సుంకమ్మ 13వ తేదీన జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్టు కొడుకుతో చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు తల్లిని తీవ్రంగా దూషించాడు.
మద్యం మత్తులో సుత్తితో కొట్టి తల్లిని చంపిన కొడుకు
ఆ తర్వాత మద్యం సేవించి ఇంటికి వచ్చి మళ్లీ తల్లితో గొడవకు దిగాడు. ఆవేశంలో ఊగిపోయిన కొడుకు అక్కడే ఉన్న సుత్తిని తీసుకుని సుంకమ్మ తలపై ఇనుప సుత్తితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వడ్డే వెంకటేశులు అక్కడి నుండి పరారయ్యాడు.
పరారీలో ఉన్న కొడుకు కోసం పోలీసుల గాలింపు
గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని, సుంకమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా ఏపీలో ఒక రాజకీయ పార్టీకి ఓటు వేసినందుకు తల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చటం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.












Click it and Unblock the Notifications