తెలంగాణ మాజీ ఎంపిలకు సోనియా అక్షింతలు
న్యూఢిల్లీ: తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్రుమన్నారు. తెలంగాణ మాజీ ఎంపీలు శుక్రవారం సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ ఇచ్చినా ఫలితం చూపించలేకపోయారని ఆమె వారిపై మండిపడినట్లు సమాచారం. అయితే, బలమైన పిసిసి అధ్యక్షుడిని పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని వారు సోనియాకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఇస్తే 17 సీట్లలో 16 సీట్లు సాధించి పెడతామని తెలంగాణ ఎంపీలు హామీ ఇస్తూ వచ్చారు. అయితే, అందుకు పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెసు రెండు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా వారు కలిశారు.
ఎన్నికల్లో తాము ఓడిపోయినంత మాత్రాన తమ బాధ్యతలు విస్మరించబోమని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది...తెచ్చింది కాంగ్రెస్సే అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఓటమిపై తొలిసారి మూకుమ్మడిగా స్పందించారు.
శుక్రవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ తెలంగాణ నిర్మాణంలో తమ పాత్ర ఉంటుందన్నారు. చారిత్రాత్మక తెలంగాణ సాధనలో తమ పోరాటం చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ప్రజల ఆశయానికి అనుగుణంగా ఐక్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా నిర్వహిస్తామని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు చెప్పారు.