అనూహ్యం: టీడీపీ ఎంపీలతో సోనియా భేటీ! కీలక చర్చ, స్పీకర్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ నాలుగో రోజైన గురువారం కూడా లోక్సభలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ సభలో వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేస్తున్న సందర్భంలో.. స్పీకర్ చైర్ ముందు కూర్చుని ఉండే ఉద్యోగులు కాస్తంత ఇబ్బంది పడ్డారు. దీంతో సుమిత్రా మహాజన్ కల్పించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎంపీలకు స్పీకర్ వార్నింగ్
‘నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. దయచేసి మన లోక్ సభ ఉద్యోగుల గురించి ఆలోచించండి. వారికి దూరంగా జరగండి. వారు మీ కోసమే పని చేస్తున్నారు. వారికేమైనా జరిగితే మంచిది కాదు. అందువల్ల వారికి దూరం జరగండి' అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు ఉద్యోగులకు దగ్గరగా వచ్చి, వారిపై పడుతున్నారని, ఇది సరికాదని చెప్పారు.
శివప్రసాద్పై ఆగ్రహం
చిత్తూరు ఎంపీ శివప్రసాద్, వెల్ లోకి దూసుకెళ్లి చేసిన గలాటాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎదుట ఉన్న పుస్తకాలను శివప్రసాద్ లాగి పారేసే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, అధికారులు శివప్రసాద్ ను అడ్డుకున్నారు. ఆపై స్పీకర్ స్పందిస్తూ.. శివప్రసాద్ వైఖరిని తప్పుబట్టారు. ఈ ప్రవర్తన సరికాదని హితవు పలుకుతూ, సభను ఇలా అడ్డుకోవడం సరికాదని, నిరసన తెలిపే హక్కుందని, అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని అన్నారు.
చర్యలు తప్పవంటూ హెచ్చరిక
కాగా, నిరసనలు విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని ఆమె కోరినా, టీడీపీ ఎంపీలు వినే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో తనకు మిగిలిన ఆప్షన్ ఒకటేనని, చర్యలకు సిఫార్సు చేస్తానని కూడా స్పీకర్ హెచ్చరించారు. సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు కూడా వాయిదా పడుతూ కొనసాగుతున్నాయి.
నేనేమైనా అంటే బాధపడ్తారు, వారిని తన్నాలనిపిస్తోంది: బడ్జెట్పై జేపీ కీలక వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీలతో సోనియా చర్చలు
ఇది ఇలా ఉండగా, గురువారం నాటి లోక్ సభ సమావేశాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితి గురించి ఆమెకు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, పి.రవీంద్రబాబులు వివరించారు. ఈ ఘటన సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.
నిరసన తెలిపినా.. శాంతంగానే సోనియా
మరోవైపు, ఇదే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. లోకసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. ఆయన ఎదుట ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో ఖర్గే పక్కనే కూర్చున్న సోనియా ప్రశాంతంగా ఉండగా.. ఖర్గే మాత్రం టీడీపీ ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు.