కెసిఆర్ది అధికార దాహమే, ఎండగట్టండి: సోనియా
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఒకరి మాటపై మరొకరికి విశ్వాసం ఉండాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్ణయంపై వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాంగ్రెసులో విలీనం చేయబోమని కెసిఆర్ చేసిన ప్రటకటనపై ఆమె రాష్ట్ర పార్లమెంటు సభ్యుల వద్ద స్పందించినట్లు తెలుస్తోంది. కెసిఆర్ అధికార దాహంపై ప్రజలకు వివరించాలని ఆమె పార్టీ ఎంపీలకు సూచించారు.
తాను అన్న మాటలకు తానే విలువ ఇవ్వకపోవడం సరికాదని కెసిఆర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలందరికీ సోనియాగాంధీ సోమవారం తన నివాసంలో విందు ఇచ్చారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ ఎంపీలు కెసిఆర్ ప్రకటనను సోనియా, దిగ్విజయ్, అహ్మద్ పటేల్ల దృష్టికి తీసుకెళ్లారు. కెసిఆర్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని వారు అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదని, ఒకరిమాటపై ఒకరు విశ్వాసం ఉంచాలని, పొత్తు కూడా వద్దంటే వద్దని వారు అన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత ఇవ్వనందువల్లనే కెసిఆర్ కాంగ్రెస్లో తెరాసను విలీనం చేయలేదని తమ పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు. కెసిఆర్ మీద ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉందని, అలాగే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తే తమకు టిక్కెట్లు దక్కవని భావించిన కొందరు నాయకులు కూడా స్వార్థంతో వ్యవహరించి విలీనానికి అడ్డుపడ్డారని కాంగ్రెసు ఎంపీలు చెబుతున్నారు.