శబరిమలకు ప్రత్యేక రైళ్లు - తెలుగు రాష్ట్రాల మీదుగా : రిటర్న్ జర్నీ కోసం సైతం..!!
అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే భారీగా ఉన్న డిమాండ్... సంక్రాంతి వరకు రైళ్లలో కనిపిస్తున్న వెయిటింగ్ లిస్టుతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. అదే విధంగా తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేకంగా రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. కార్తీక మాసం ముగియటంతో పాటుగా.. మండల దీక్ష పూర్తి చేసుకున్న వారు పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప దర్శనం కోసం వెళ్లనున్నారు.
ఈ నెల 19-22 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
అనేక మంది ముందుస్తుగానే రిజర్వేషన్ చేసుకున్నారు. కానీ, రైళ్ల సంఖ్య భక్తుల సంఖ్యకు తగినట్లుగా లేకపోవటంతో కేరళ వైపు అన్ని రైళ్లలోనూ భారీగా వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రైళ్ల కోసం డిమాండ్ పెరిగుతోంది. దీంతో..కాచీగూడ నుంచి కొల్లాం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలోనూ కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. కాచిగూడ-కొల్లాం మధ్య ఈ నెల 19-22 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
కాచిగూడ-కొల్లామ్-కాచిగూడకు
ప్రధానంగా ఈ నెల 19, 20 తేదీల్లో కాచిగూడ-కొల్లామ్కు ప్రత్యేక రైళ్లు (07053, 07141), ఈ నెల 21, 22 తేదీల్లో కొల్లామ్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు(07054, 07142) నడుపుతామన్నారు. 07053, 07054 ప్రత్యేక రైళ్లు షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపర్తి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, కొండూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్పట్టాయ్, సేలం, కోయంబత్తూర్, కలాక్కడ్, త్రిసూర్, ఏర్నాకుళం, కొట్టాయం, చెగంచేరి, తిరువల్లా, చెంగన్నూర్, మవెలికర, కాయన్కులం స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.
ఈ స్టేషన్ల మీదుగా కొల్లామ్ వరకు
07141, 07142 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సెరం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపర్తి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కొండూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పట్టై, సేలం, ఎరోడ్, కోయంబత్తూర్, పలక్కడ్, త్రిసుర్, ఎర్నాకుళం, కొట్టాయం, చెంగన్చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికర, కాయన్కులం స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
Recommended Video
సికింద్రబాద్ - కొల్లామ్ - సికిందరాబాద్ షెడ్యూల్
అలాగే ఈ నెల 17న సికింద్రాబాద్-కొల్లామ్ మధ్య ప్రత్యేక రైలు(07109), 19న కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైలు(07110)ను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ద్వారా భక్తులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. అయితే, అసలు ఇప్పుడున్న రద్దీకి ఈ రైళ్లు సరిపోవని.. మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో..ఈ నెలాఖరులో మరిన్ని ప్రత్యేక రైళ్ల ఏర్పాటు దిశగా రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.