ప్రకాశం జిల్లా నెత్తిన పాలు పోసిన కేంద్రం
దక్షిణమధ్య రైల్వే పరిధిలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లా పరిధిలోని గుండ్లకమ్మ-దర్శి మధ్య నిర్మించిన 27 కిలోమీటర్ల రైల్వే లైను సిద్ధమైంది. రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభించినట్లు గుంటూరు డీఆర్ఎం వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయని, ఈ లైనులో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.
ఏపీలోని ప్రధానమైన రైల్వే ప్రాజెక్టుల్లో నడికుడి-శ్రీకాళహస్తి ఒకటి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలన్నింటినీ ఈ రైల్వేలైను ద్వారా విజయవాడ-రేణిగుంట మార్గంలోని శ్రీకాళహస్తి దగ్గర కలుపుతారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2289కోట్లు. మొత్తం రైల్వే లైను నిర్మాణం 309 కిలోమీటర్లు. రైల్వే, ఏపీ ప్రభుత్వం చెరిసగం చొప్పున ఖర్చును భరించాయి. భూమిని ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఈ మార్గంలో మొత్తం 38 స్టేషన్ల నిర్మాణం జరగబోతోంది. పనులు ఆలస్యంగా జరుగుతుండటంవల్ల రోజురోజుకు ప్రాజెక్టు ఖర్చు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

నడికుడి- శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శి, అద్దంకి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల ప్రజలకు కొత్తగా రైల్వే లైను అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని, సరకు రవాణా వేగవంతమవుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications