దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఏర్పాట్లు; అమిత్ షా పర్యటన ఫిక్స్; నిఘా నీడన తిరుపతి !!
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం నవంబర్ 14 ఆదివారం నాడు తిరుపతి నగరంలోని తాజ్ హోటల్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా రానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తిరుపతి పర్యటన ఖరారైంది.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు రోజులు రద్దు.. ఎందుకు, ఎప్పుడు అంటే
మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్న అమిత్ షా
మూడు రోజుల పాటు తిరుపతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈనెల 13వ తేదీన తిరుపతికి రానున్న అమిత్ షా 14వ తేదీన ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈ నెల 15వ తేదీన శ్రీవారి దర్శనం అనంతరం అమిత్ షా తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్టు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.
దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలివే
ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా హాజరు కానున్నారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కారణంగా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
భారీ బందోబస్తు ఏర్పాటు.. 14 చెక్ పోస్టుల ఏర్పాటు
2500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తుకు రాయలసీమ జిల్లాలతో పాటుగా తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాలలోని పోలీసులకు విధులు అప్పగించారు. సమావేశం జరగనున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారులతో సమన్వయ నోడల్ ఆఫీసర్ ను నియమించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందాలను కూడా రంగంలోకి దింపి సమావేశాలు జరిగే చుట్టుపక్కల పరిసరాలను తనిఖీ చేస్తున్నారు. మొత్తం సమావేశం జరిగే ప్రాంతాలలో 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
నిఘా నీడలో తిరుపతి
అంతేకాదు ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన తిరుపతి మహానగరంలో సమావేశాలు జరుగుతున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, తిరుపతి నగరంలోని లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గెస్ట్ హౌస్ లను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలను డాగ్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం కారణంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ లు, అమిత్ షా రానున్న నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి నగరం నిఘా నీడలో ఉంది.
13, 14,15 తేదీలలో విఐపి దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం వచ్చే భక్తులకు నవంబర్ 13, 14,15 తేదీలలో విఐపి దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారుల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కారణంగా సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చేవారు ఆ మూడు రోజుల్లో రావద్దని పేర్కొన్నారు టీటీడీ అధికారులు. 12, 13,14, 15 తేదీలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, అలాగే 12, 13, 14 తేదీలలో వీఐపీ దర్శనాల లేఖలు అనుమతించబడవని స్పష్టం చేశారు.