భర్త దాడి, బిడ్డని ఇప్పించండి: కోడెల కోడలు కన్నీరు
విశాఖపట్నం: తన భర్త, మరి కొంతమంది దాడి చేసి తన బిడ్డను తన దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కోడలు పద్మప్రియ సోమవారం అభ్యర్థించింది. తన తల్లిదండ్రులతో కలిసి విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కోడెల తనయుడు శివరామకృష్ణతో 2009 ఆగస్టు 6 తేదీన తనకు వివాహమైందని చెప్పారు.
వివాహమైన కొద్దిరోజుల నుంచి తనను మామ, భర్త శివరామకృష్ణ, ఆడపడచు నిత్యం మానసికంగా వేధించేవారని పేర్కొంది. తను గర్భం దాల్చినప్పటికీ వేధింపులు తగ్గలేదన్నారు. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వేధింపులు భరించలేక తాను నాల్గవ నెలలో తన పుట్టింటికి వచ్చేశానని, కొంతకాలం తరువాత పెద్దల జోక్యంతో తన భర్త కాపురానికి తీసుకువెళ్లారని, ఆ తరువాత కూడా వేధింపులు తప్పలేదని ఆరోపించారు.
వివాహ సమయంలో 10 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చామని, ఆ తర్వాత మరికొంత మొత్తాన్ని తీసుకురమ్మనమని వేధించేవారని, వేధింపులు భరించలేక, గత ఏడాది విశాఖలోని తన పుట్టింటికి వచ్చేశానని చెప్పారు. ఈ నెల 17న రాత్రి 10 గంటల సమయంలో తన భర్తతో, మరికొంతమంది తన ఇంటి తలుపులు బద్దలుకొట్టి తనను, తన తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టి, నాలుగేళ్ల వయస్సున్న తన కొడుకు గౌతమ్ను దౌర్జన్యంగా తీసుకువెళ్లిపోయారని ఆరోపించారు.
ఈ విషయాన్ని తాను ఎసిపికి ఫోన్లో తెలియచేయగా, ఫిర్యాదు తీసుకున్నారన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా, అప్పటికే విశాఖలో కోడెలకు చెందిన ఓ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తితో తన తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారన్నారు. తన నుంచి దూరమైన తన బిడ్డ ఎలా ఉన్నాడో అని తనకు ఆందోళనగా ఉందని, తన బిడ్డను తనకు అప్పగించాలని, తన తల్లిదండ్రులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.