చౌరస్తాలో బాబు: ఆఫ్షన్లు ఇవీ, పవన్తోనా, కాంగ్రెస్తోనా?
అమరావతి: ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పయనం ఎటువైపు అనే చర్చ సాగుతోంది.
ఎన్డీఎ నుంచి తప్పుకోకపోయినప్పటికీ ఆయన రాజకీయంగా ఎటు అడుగు వేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. బిజెపితో తెలుగుదేశం పార్టీ కలిసి నడవడం ఇక ఏ మాత్రం సాధ్యం కాదని అంటున్నారు. అయితే, ఆయన ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటనేది ప్రశ్న.

బిజెపిని నిందించడం ద్వారా...
ప్రత్యేక హోదాపై, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై చంద్రబాబు బిజెపిని నిందించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్ల బిజెపి సిద్ధపడినా చంద్రబాబు వేరు పడడానికే ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు పార్టీని రాష్ట్ర విభజనకు కారణమంటూ నిందించి రాజకీయ ప్రయోజనం పొందారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నమోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని అనుసరిస్తారు.

చంద్రబాబు ఒంటరిగా వెళ్తారా...
వచ్చే ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన లేకుండా చంద్రబాబు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం అనేది ఒక ప్రత్యామ్నాయం. కేంద్రంపై విరుచుకుపడడం ద్వారా బిజెపి వ్యతిరేక ఓట్లను తన వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు మిగతా పార్టీలకు వెళ్లకుండా తనవైపు మళ్లించుకోవచ్చు. అదే సమయంలో మైనారిటీల మద్దతు కూడా పొందవచ్చు. రాయలసీమలోని 20 శాసనసభా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బిజెపితో పొత్తు వల్ల వారంతా టిడిపికి వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. అయితే, 2014 ఎన్నికల్లో టిడిపికి, జగన్ నాయకత్వంలోని వైసిపికి మధ్య ఓట్ల తేడా కేవలం 2.07 శాతం మాత్రమే. అందువల్ల చంద్రబాబు ఒంటరిగా వెళ్లడానికి సాహసిస్తారా అనేది ప్రశ్న.

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు మరోటి...
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా వామపక్షాలను దరి చేరుకోవడం చంద్రబాబు వద్ద ఉన్న మరో ప్రత్యామ్నాయం. అయితే, ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. చంద్రబాబు నిర్ణయం తీసుకునే లోగా కేసీఆర్ దానికి ప్రాతిపదిక ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఈ స్థితిలో కేసీఆర్ నాయకత్వంలో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్లో పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి ప్రధాన కారణం స్థాయికి సంబంధించిన సమస్య తలెత్తడం. కేసీఆర్ను తనతో సమానంగా చూసేందుకు చంద్రబాబు సిద్ధపడుతారా అనేది సందేహం.

కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం...
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం ఉంటుంది. బిజెపిని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధపడే అవకాశాలు ఉంటాయా అనేది ప్రశ్న. రాష్ట్రంలో సొంతంగా పోటీ చేసే స్థితిలో కాంగ్రెసు లేదు. మైనర్ భాగస్వామిగా కాంగ్రెసును చేర్చుకుంటే ప్రయోజనం ఉండవచ్చు. అయితే, విభజనపై చంద్రబాబు మొదటి నుంచి కూడా కాంగ్రెసు పార్టీనే దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, అది ఇరుపార్టీలకు పెద్ద ఆటంకం కాకపోవచ్చు. కానీ, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటే టిడిపికి సంప్రదాయ ఓటర్లు ఏమైనా దూరమవుతారా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. టిడిపి ఆవిర్భావిమే కాంగ్రెసు వ్యతిరేకత నుంచి జరిగింది కాబట్టి ఆ ప్రమాదం ఉంటుంది.

పవన్ కల్యాణ్తో అవకాశం ఉంటుందా....
లౌకికవాదం పేరుతో వామపక్షాలను, పవన్ కల్యాణ్ జనసేనను చంద్రబాబు కలుపుకుని వెళ్లడానికి సిద్ధపడవచ్చు. వామపక్షాల్లో సిపిఎం అందుకు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ దోస్తీ చంద్రబాబుకు కలిసి వచ్చింది. ఆయన సహకారం వల్లనే దాదాపుగా చంద్రబాబుకు అధికారం దక్కింది. అయితే, జెఎఫ్సి పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసి వివిధ వర్గాలతో, వ్యక్తులతో, నాయకులతో కలిసి పనిచేస్తున్నారు. వారిలో ఎవరు ఎటు వైపు ఉంటారనేది తెలియదు. కానీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ గళమెత్తుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు మలుచుకోవాలని పవన్ కల్యాణ్ చూస్తే చంద్రబాబుకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కకపోవచ్చు.












Click it and Unblock the Notifications