ఏపీకి ప్రత్యేక హోదా...అసలు చర్చలోనే లేదు...తేల్చేసిన బిజెపి ఎంపీ హరిబాబు
విశాఖపట్టణం: ఏపీకి ప్రత్యేక హోదా అసలు చర్చలోనే లేదని విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. హోదాకు తగ్గకుండా ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని పునరుద్ఘాటించారు. తద్వారా ఇది ముగిసిన అధ్యాయమని ఎంపి హరిబాబు చెప్పకనే చెప్పినట్లయింది.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యే హోదా అంశం అసలు చర్చలో లేదని విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై స్పష్టత ఇచ్చారు. అయితే ప్రత్యేక హోదాకు తగ్గకుండా ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకారం రాష్ట్రానికి ఏ విధంగా సహాయం చేయాలని నిర్ణయం జరిగిందో...ఆ విధంగా ప్రత్యేక హోదా ఉంటే, రాష్ట్రానికి ఏ విధమైన ఆర్థిక వెసులుబాటు ఉండేదో...అవన్నీ లెక్కించి, దానికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేయాలనే నిర్ణయం జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు.

ప్రత్యేక రైల్వే జోన్ కేంద్ర పరిశీలనలో ఉందని, దానిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని తాము కోరామని, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిశామని హరిబాబు స్పష్టం చేశారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో ఇటీవల మళ్లీ ఆందోళనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బిజెపి ఎంపి హరిబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications