రాజమండ్రి సెంట్రల్ జైలులో బాబు: ప్రత్యేక సౌకర్యాలు, ఇంటి భోజనం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం, విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.
ఈ ఉదయం ఆయనను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్పై సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించారు.

చంద్రబాబు తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. వందల కోట్ల రూపాయల మేర కుంభకోణంతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల ప్రధాన నిందితుడు, ఏ1 చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యులు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించారు. 14 రోజుల పాటు రిమాండ్కు తరలిస్తూ తీర్పు ఇచ్చారు.
జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న అనంతరం పోలీసులు చంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. కొద్దిసేపటి కిందటే వారు రాజమండ్రికి చేరుకున్నారు. ఈ నెల 22వ తేదీ వరకూ చంద్రబాబు సెంట్రల్ జైలులో ఉంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
కాగా- చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కావడం, ప్రతిపక్ష నేత హోదా ఉండటం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్కు ప్రత్యేకంగా ఆదేశాలను జారీ చేసింది.
విచారణను ఎదుర్కొన్నన్ని రోజులు చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఆయనకు అందుబాటులో ఉంటాయి. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునే వెసలుబాటును కల్పించింది ఏసీబీ న్యాయస్థానం. 24 గంటల పాటు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది.












Click it and Unblock the Notifications