పవన్ ఎనర్జిటిక్ లీడర్,శంకించొద్దు: ప్రత్యేక హోదాకు మాజీ ప్రధాని మద్దతు
బెంగళూరు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన గళం వినిపించిన మరుసటి రోజే మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ్ ఏపీ హోదా వాదనకు మద్దతు ప్రకటించారు. విజయవాడ నగరంలో ఓ జ్యువెల్లర్స్ షోరూమ్ను ప్రారంభించేందుకు శనివారం రాత్రికే విజయవాడ చేరుకున్న ఆయన ఆదివారం సదరు షోరూంకు రిబ్బన్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని గౌడ పేర్కొన్నారు. సదరు హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్నేహంగా ఉన్నారని, ఈ క్రమంలో ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఎక్కడా చెప్పలేదని కూడా గౌడ చెప్పారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటనలో కేంద్రానికి ఉన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు తప్పించి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆయన చెప్పలేదని గౌడ వ్యాఖ్యానించారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో పవన్ కళ్యాణ్ విజయవంతమవుతారా? అని మీడియా ప్రశ్నించగా.. 'యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ పవన్ కళ్యాణ్. అతని ప్రయత్నాన్ని అనుమానించడం ఎందుకు?' అని ప్రశ్నించారు.
ఇది ఇలాఉండగా, ఇటీవల దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. పవన్ కళ్యాణ్ను కలిశారు. అయితే ఇది కుమారస్వామి కుమారుడి సినిమా ప్రవేశంపై చర్చించేందుకేనని తెలిసింది. 'తన మనవడు నిఖిల్ కుమారస్వామి 'జాగ్వర్' అనే సినిమాతో కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రంలో హీరోగా నటించారు. ఇది త్వరలో విడుదల కానుంది. దీని విషయంపైనే పవన్తో కుమారస్వామి కలిశారు.'అని దేవేగౌడ్ తెలిపారు.