హోదా ఇస్తే మోడీపై వారి దాడి: బీజేపీతో దోస్తీ, జగన్ కన్ను, బాబుకు చిక్కేనా?
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి, ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైన భారతీయ జనతా పార్టీ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. ఏపీకి ప్రత్యేక హోదా లేదా దాదాపు ఆ స్థాయి ప్యాకేజీ ఇచ్చేందుకు ఢిల్లీలో కేంద్రమంత్రులు కసరత్తు చేస్తున్నారు.
రెండు నెలల్లో ఏదో ఒక ప్రకటన రానుందని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి విడతలుగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
హోదా, ప్యాకేజీ పైన కేంద్రం తర్జన భర్జన పడుతోంది. పోలవరానికి కేంద్రం సాయం పైన ఈ భేటీలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. విదేశీ రుణ ప్రాజెక్టుల కింద సాయం పైన చర్చించారు.
ఏపీకి హోదాపై భేటీలు: తెలంగాణ అభిప్రాయమని వెంకయ్య!
హోదా కోసం సుజన పట్టు, సమర్థించిన వెంకయ్య
ఏపీకి హోదా ఇవ్వాలని టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి పట్టుబట్టారు. సుజన మాటలకు వెంకయ్య కూడా వంత పాడారని తెలుస్తోంది. ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన చెప్పారని తెలుస్తోంది. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 11 రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తాయని, ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని జైట్లీ చెప్పినట్లుగా తెలుస్తోంది. చర్చల్లో మాత్రం కొంత పురోగతి కనిపించిందని సమాచారం.
సమాచారం మేరకు.. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మీ అభిప్రాయం చెప్పి ఉంటే ప్రజలైనా, మేమైనా అర్థం చేసుకునేవాళ్లమని, రెండేళ్లు సాగదీసి ఇప్పుడు హోదా ఇవ్వలేమంటే రాజకీయంగా సరైన వైఖరి అనిపించుకోదని, ఇప్పుడు ఈ సమస్య జఠిలమైందని, హోదా ఇస్తే మీ ప్రతిష్ఠ పెరుగుతుందని, ఎలాగైనా హోదాను ఇవ్వాలని సుజనా కోరారని తెలుస్తోంది. దానిని వెంకయ్య సమర్థించారు.
దానికి జైట్లీ మాట్లాడుతూ.. తమ వద్ద పదకొండు రాష్ట్రాల హోదా డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని, ఏ కారణం చూపి మీకు ఒక్కరికి హోదా ఇచ్చినా మిగిలిన అన్ని రాష్ట్రాలు మా మీద పడతాయని, ప్రతి రాష్ట్రంలో ఇదే ఒక ఎన్నికల అంశంగా మారుతుందని, తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని, హోదాకు ప్రత్యామ్నాయంగా అదే స్థాయిలో ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని తెలుస్తోంది. కాగా, ఈ భేటీలో నియోజక వర్గాల పునర్విభజనపై మరోసారి ఆలోచిస్తామని జైట్లీ చెప్పారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తమకూ కావాలని పట్టుబడుతున్న రాష్ట్రాలలో తమిళనాడు (జయలలిత), కర్నాటక (సిద్ధరామయ్య), బీహార్ (నితీష్ కుమార్), తెలంగాణ(కేసీఆర్) తదితర రాష్ట్రాలు ఉన్న విషయం తెలిసిందే.
బీజేపీతో దోస్తీ: చేరికలు, బాబుకు మొదటికే మోసమా?
ఏపీలో పలువురు వైసిపి నేతలు ఇటీవలి వరకు టిడిపిలో చేరారు. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ నేత టిడిపి నుంచి వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వైసిపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
ఓ వైపు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరకపోవడం, మరోవైపు, కొత్త రాష్ట్రమైనందున కేంద్రం సాయం కోసం బీజేపీ నుంచి దూరం జరిగేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో 2019లో చంద్రబాబుకు మొదటికే మోసం కావొచ్చని అంటున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమి కూడా విడిపోయే అవకాశం లేదని, తద్వారా తమకు పోటీ చేసేందుకు అవకాశం రాదనే సత్యనారాయణ వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హోదా ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా ఓ వైపు ఇబ్బందులకు గురవుతుంటే, మరోవైపు బీజేపీతోనే అంటకాగితే.. మరికొందరు నేతలు వైసిపిలోకి క్యూ కట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.