బీహార్ వేరు, ఏపీ వేరు: చంద్రబాబు పర్యటనలో స్పష్టత వచ్చేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి 'ప్రత్యేక హోదా' మంగళవారం వేడి రాజుకుంది. బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ భారీ ప్యాకేజీ ప్రకటించారు. దీంతో, ఏపీలో విపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా లేదా ఏదో ఒక రకంగా ఆదుకోవడం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా పైన తగ్గే ప్రసక్తి లేదని కొందరు చెబుతుంటే, భవిష్యత్తు కోసం ఏదో ఒక రకంగా ఆదుకోవాలని మరికొందరు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీహార్ ఎన్నికలతో లింక్ పెడుతున్నారన్న వాదనల పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఘాటుగా స్పందించారు.
బీహార్ బీహారేనని, ఏపీ ఏపీయేనని చెప్పారు. అసలు బీహార్ ఎన్నికలకు ఏపీకి ప్రత్యేక హోదాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఏపీకి హోదా కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పేరేదైనా ఏపీకి కేంద్రం సాయం చేయాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదన్నారు. హోదా విషయంలో చంద్రబాబుకు సహకరిస్తామని విపక్షాలు చెప్పాయి.
బీహార్కు ప్రధాని మోడీ రూ.1.65 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. దీంతో విపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం మరింత పట్టుబడుతున్నాయి. విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ సిఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యే విషయమై ఆసక్తిని రేపుతోంది. మరోవైపు, ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ.. వైసిపి ఈ నెల 29న బందును విజయవంతం చేసేందుకు పావులు కదుపుతోంది.
మంగళవారం బీహార్లో పర్యటించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ... రూ.60వేల కోట్లు ఇస్తారా లేక రూ.90వేల కోట్లు ఇస్తారా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారని, రూ.1.25 లక్షల కోట్లు ప్రకటిస్తున్నానని, దీంతో ప్రజలు హర్షధ్వనాలు వ్యక్తం చేశారన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చానని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు బీహార్కు ఊహించని విధంగా సాయం చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ... భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని బిజెపి నేతలు ఆశిస్తున్నారు. బీహార్కు ఊహించని ప్యాకేజీ ఏపీలోను ఉత్కంఠ రేపుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీహార్ ఎన్నికల దృష్టా వాయిదా చంద్రబాబుతో జరిగే భేటీలోనే స్పష్టత రాకపోవచ్చునని భావిస్తున్నారు.