ప్రత్యేక హోదాపై రగులుతున్న ఎపి: రేపు బంద్, ఆత్మరక్షణలో బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెగ రగులుతోంది. ప్రత్యేక హోదా రాదని దాదాపుగా ఖాయమైన స్థితిలో ప్రతిపక్షాలు పోరాటానికి నడుం బిగించాయి. కాంగ్రెసు తలపెట్టిన తిరుపతి సభలో మునికోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. మునికోటి అంత్యక్రియలకు ఎపి కాంగ్రెసు నాయకులంతా హాజరయ్యారు.
ప్రత్యేక హోదాపై పోరాటానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఏకతాటికి మీదికి వస్తుండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించలేదని టిడిపి ఎంపీలు అంటున్నప్పటికీ వారికి కూడా ఆశలు సన్నగిల్లినట్లే ఉంది. వైయస్ జగన్పై గానీ ఇతర ప్రతిపక్షాల నాయకులపై గానీ టిడిపి నాయకులు ధాటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు.
ప్రత్యేక హోదాపై తాను కూడా విమర్శలు ఎదుర్కుంటున్నప్పటికీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పెద్దగా మాట్లాడడం లేదు. బిజెపి జాతీయ నాయకులు గానీ, కేంద్ర మంత్రులు గానీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదు. అయితే, రాష్ట్ర నాయకులు మాత్రం ప్రత్యేక హోదా రాదని సంకేతాలు ఇస్తున్నారు. బిజెపి వైఖరి వల్ల కూడా చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. బిజెపిపై పోరాటం చేయలేక, ప్రతిపక్షాలను ఎదుర్కోలేక టిడిపి సతమతం అవుతోంది.

ఇదే అదునుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి, చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్తో పాటు వైసిపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాగా, సిపిఐ, కాంగ్రెసు రేపు (మంగళవారంనాడు) రాష్ట్ర బంద్ను తలపెట్టాయి. బంద్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెసు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. బంద్కు మద్దతు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఢప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా బంద్కు మద్దతు ప్రకటించింది.
కాగా, ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్ రాష్ట్రబంద్కు పిలుపునిచ్చారు. వైయస్ జగన్ దీక్షకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు పలికారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి నడవడానికి సిపిఎం సిద్ధపడినట్లు కనిపిస్తోంది. కాగా, కాంగ్రెసు, సిపిఐ కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎపికి ప్రత్యేక హోదా వస్తుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఇప్పటికీ నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ దీక్ష చేపట్టిన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై లోకసభలో చర్చకు టిడిపి ఎంపీలు సోమవారం నోటీసు ఇచ్చారు.
అయితే, పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివ రావు దాదాపుగా ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని చెప్పేశారు. సోమవారం బిజెపి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు హరిబాబు కూడా అదే విషయం చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధులకన్నా కేంద్రం ఎపికి రెండింతలు ఎక్కువ నిధులు ఇస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications