బాబుపై అందుకే బీజేపీ ఆగ్రహం: 'రాజ్యసభ'తో 'స్పెషల్' చెక్ చెప్పేనా?
విజయవాడ: ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీ బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టం చేసిన అనంతరం టిడిపి నేతలు కమలం పార్టీ పైన మండిపడ్డారు. చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, కొత్త రాష్ట్రమైన ఏపీకి కేంద్రం అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాస్తా తగ్గిన విషయం తెలిసిందే. అయినప్పటికీ టిడిపితో కలిసి ఉండేందుకు బీజేపీ నేతలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. టీడీపీతో దూరం జరగడమే మంచిదని అధిష్టానానికి కూడా సూచిస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే టిడిపి ఓ మెట్టు దిగినప్పటికీ.. బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం చంద్రబాబు, టిడిపిని దనుమాడుతున్నారు.

దూరం వెనుక ఎన్నో కారణాలు
చంద్రబాబును టార్గెట్ చేసేందుకు బీజేపీకి ఎన్నో కారణాలున్నాయని అంటున్నారు. ప్రధానంగా 2019 నాటికి టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే 2019లోనే అధికారంలోకి వస్తామని కొందరు నేతలు చెబుతుండటం గమనార్హం.
2019లో బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చినా, రాకపోయినా.. టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదగాలని భావిస్తున్నారు. అయితే, వారి ఎదుగుదల ప్లాన్కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబు వల్ల ఎదురు దెబ్బ తగులుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో కాపు సామాజిక వర్గం చాలా కీలకం. వీరిని బీజేపీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే సోము వీర్రాజు వంటి నేతలు ఇటీవలి వరకు దూకుడు ప్రదర్శించారు. ఏపీలో పట్టు లేకపోవడంతో కాపు సామాజిక వర్గం ద్వారా ఎదగాలని భావించింది.
కానీ, చంద్రబాబు వారికి చెక్ చెప్పే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. వైసిపికి చెందిన జ్యోతుల నెహ్రూ వంటి కీలక కాపు నేతలను టీడీపీలో చేర్చుకున్నారు. చంద్రబాబు వైసిపిని దెబ్బతీసినప్పటికీ.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరిగా.. ఇది బీజేపీకి కూడా దెబ్బే.
వైసిపి నుంచి వరుసగా కీలక నేతలు టిడిపిలో చేరుతున్నారు. అందులో కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఉన్నారు.
మరోవైపు, వైసిపికి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా టిడిపిని బలపర్చుకుంటున్నారు. అప్పుడు అక్కడ బిజెపికి ఇబ్బందికర పరిణామమే ఎదురవుతుందని చెప్పవచ్చు.
ఇక, 2019 నాటికి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లోను తమతోనే ఉంచుకోవాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది. పవన్ కళ్యాణ్ టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తారని, గత ఎన్నికల్లో బీజేపీతో కలిసినందువల్లే టిడిపి - బీజేపీ కూటమికి మద్దతిచ్చారనే వాదనలు ఉన్నాయి.
టీడీపీ నుంచి దూరం జరిగితే పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం హామీని నెరవేర్చుకోకుంటే మాత్రం పవన్ కమలం పార్టీకి కూడా దూరం జరగుతారని చెప్పవచ్చు. ఆ హామీని నెరవేరిస్తే మాత్రం కచ్చితంగా బీజేపీ వైపు మొగ్గుచుపుతారని అంటున్నారు.
కేంద్రమంత్రులు హోదాపై తేల్చివేసినప్పటికీ.. ఇవ్వలేరని అప్పుడే పూర్తిగా కొట్టి పారేయలేమని అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమైనా 2019కు ముందు నిర్ణయం తీసుకోలేరని చెప్పలేమనే వారు ఉన్నారు.
బాబు రాజ్యసభతో బుజ్జగించేనా?
ఏపీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంతో జగడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు కొంచెం తగ్గారు. అయితే, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తామని, ఒప్పిస్తామని చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం విమర్శలు మానడం లేదు. ఈ నేపథ్యంలో 'రాజ్యసభ' ఎన్నికల నేపథ్యంలో దాంతో బీజేపీని చంద్రబాబు బుజ్జగించేనా, ఆ ప్రయత్నం సఫలమయ్యేనా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications