ఇక్కడ గెలిచినవారిదే అధికారం
ఏపీలో మహా సంగ్రామం జరుగడానికి సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వచ్చిన అనంతరం హోరాహోరీగా తలపడేందుకు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందుకు కావల్సిన అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. జనసేనతో పొత్తు ఖరారై అభ్యర్థులను కూడా ప్రకటించింది. బీజేపీ కోసం ఈ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి.
రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ కీలకమైన ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఎంతోమంది సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి వి.కళావతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఈమె టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 17,980 ఓట్ల తేడాతో గెలుపొందారు.

2014 ఎన్నికల్లో కూడా కళావతి టీడీపీ అభ్యర్థి జయకృష్ణపై గెలుపొందారు. వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన కళావతి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున బరిలోకి దిగి మూడోస్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో 21,725 ఓట్లు సాధించారు. అనంతరం వైసీపీలో చేరి రెండుసార్లు విజయాన్ని దక్కించుకున్నారు.
నియోజకవర్గంగా ఏర్పాటైన సమయంలో 1955, 1962 ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గంగా ఉండేది. తర్వాత 1967 ఎన్నికల నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. అతి త్వరలోనే జరగబోతున్న ఎన్నికల్లో వైసీపీని కచ్చితంగా ఓడిస్తామనే ధీమాలో తెలుగుదేశం పార్టీ ఉండగా, మరోసారి గెలుపు ఖాయమని వైసీపీ నమ్మకంతో ఉంది.












Click it and Unblock the Notifications