సీమ వాళ్లను విలన్లుగానే చూపిస్తారా?: తెలుగు సినిమాపై వైసిపి ఎమ్మెల్యే అసహనం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి శాసనసభ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాల్లో రాయలసీమ వారిని విలన్లుగా చూపించడాన్ని శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు.
మాట మాట్లాడితే రాయలసీమ గూండాలు అంటూ సినిమాల్లో చిత్రీకరించడం దారుణమన్నారు. నలుగురికి అన్నం పెట్టే గుణం సీమ ప్రజలదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
తమ దగ్గర లేకపోయిన అప్పు తెచ్చి పెట్టేటువంటి గుణం సీమ ప్రజలదని ఆయన తెలిపారు. ప్రతీ విషయంలో సీమ ప్రజలను కించపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్లో సినిమాల్లో రాయలసీమ ప్రజలను గూండాలుగా చిత్రీకరిస్తే ప్రభుత్వం నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను కించపరిచే సినిమాలు ఇకపై రాకూడదని అన్నారు.