నవ్వుతారు: కోటంరెడ్డితో శ్రీకాంత్, సౌమ్యపై వద్దని డొక్కా
హైదరాబాద్: సభలోకి వెళ్లవద్దని, వెళ్తే మళ్లీ వాళ్లు నవ్వుకుంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం అన్నారట. బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ నుండి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు జ్యోతుల నెహ్రూ తిరిగి లోపలకు వెళ్లడంతో సభాపతి, అధికార పక్షం చురకలు అంటించింది.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యే కోటంరెడ్డితో పైవిధంగా వ్యాఖ్యానించారు. సభ వాయిదా పడ్డాక జగన్.. విలేకరులతో సమావేశం నిర్వహించేందుకు గాను, అసెంబ్లీ కమిటీ హాలులోనే ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఒక లేఖను సభలో ఉన్న అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చేందుకు వెళ్లే సమయంలో ఇరువురు ఎమ్మెల్యేల మధ్య ఈ చర్చ సాగింది. దీంతో శ్రీధర్ రెడ్డి సభ ముఖద్వారం వద్దకు వెళ్లి సహాయకుడికి లేఖ ఇచ్చి కార్యదర్శి వద్దకు పంపించారు.
పోటీలో పెట్టడం లేదు: కొడాలి నాని
నందిగామ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని తాము పోటీలో నిలబెట్టడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. శాసన సభ మీడియా కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఉన్న సంప్రదాయాలను అనుసరించి మానవతా దృక్పథంతో నందిగామలో పోటీ పెట్టడం లేదన్నారు.
రఘువీరాకు డొక్కా లేఖ
నందిగామ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు నుండి పోటీ పెట్టవద్దని దివంగత తంగిరాల ప్రభాకర రావు కుమార్తె సౌమ్య ఏకగ్రీవానికి సహకరించాలని ఏపీ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డికి మాజీ మంత్రి, కాంగ్రెసు నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ లేఖ రాశారు. రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైన ప్రభాకర రావు ప్రమాణ స్వీకారానికి ముందే మృతి చెందారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులు పోటీ చేసినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ పోటీకి దూరంగా ఉన్న సంప్రదాయం రాష్ట్రంలో ఉందన్నారు. సౌమ్య విద్యావంతురాలని, పోటీ వద్దన్నారు.