ఆంధ్రా, రాయలసీమల మధ్యనే: రాజధానిపై శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి: 13 జిల్లాలతో ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని వైయస్పసార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రెండు ప్రాంతాలకు కేంద్ర బిందువుగానైనా ఏర్పాటు చేయాలని, అలా కాకుంటే రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రాజధాని నిర్మిస్తే వేర్పాటువాదం మళ్లీ తలెత్తడం ఖాయమన్నారు. శివరామన్ కమిటీ ఇప్పటికీ రాయలసీమలో పర్యటించలేదని అన్నారు.
అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిపై నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ తరాల వారికి తీరని అన్యాయం చేసిన వారమవుతామని ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. తుపాను తాకిడి, వాతావరణ పరిస్థితులు అనుకూలించని ప్రాంతంలో, తక్కువ స్థలంలోనే రాజధానిని నిర్మించకుండా లక్షలాది ఎకరాలున్న దొనకొండ లాంటి ప్రాంతంలో నిర్మించడం సమంజసమని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
ఇప్పటికే రాజధాని పరిశీలనకు శివరామన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ శనివారం ఏపి సిఎం చంద్రబాబును కలిసింది. రాజధాని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనేదానిపై చర్చించారు. ఎక్కువగా విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధానిని నిర్మించే అవకాశాలున్నాయి.