రాజమండ్రి ఘటన వివాదాస్పదం, గేట్లు మూశారు!: బాబు స్నానానికి 2 గంటలా, గవర్నర్ ఆరా
హైదరాబాద్: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తీవ్ర విషాధ సంఘటన పైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికార తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో మండిపడటం గమనార్హం.
విపక్ష నేతలు తమ వేళ్లను చంద్రబాబు వైపు చూపిస్తున్నాయి. 27మంది మృతి చెందిన విషాధం నేపథ్యంలో గంభీర వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల వైపు నుండి ఆలోచించాలని చెబుతున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి వెళ్లాలని అంటున్నారు.
చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించిన కాసేపటికి ఈ సంఘటన జరిగింది. వెంటనే చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రాజమండ్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధితుల కన్నీరుమున్నీరు చూసి ఆయన చలించిపోయారు.
చంద్రబాబు ఘాట్ వద్ద ఉండిపోవడంతో ప్రజలు ఎవరూ నీళ్లలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని, చంద్రబాబు తన పూజలు అయిపోయి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బయలుదేరిన తర్వాత అప్పుడు గేట్లు తెరిచారని, దీంతో ఒక్కసారిగా అందరూ వచ్చారని జగన్ ఆరోపించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీ గవర్నర్ నరసింహన్, ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర సీఎం కె చంద్రశేఖర రావులు దీనిపై సంతాపం తెలిపారు.
చంద్రబాబుకు గవర్నర్ ఫోన్, ఆరా
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేశారు. ఆయన రాజమండ్రి ఘటన పైన ఆరా తీశారు. కాగా, పకడ్బంధీ ఏర్పాట్లు చేసినప్పటికీ ఇలా జరగడం దురదృష్టకరమని ఎపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. భక్తులు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగిందన్నారు.
పుష్కర ఏర్పాట్లలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం: బొత్స
ఏపీలో గోదావరి పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కనీస సదూపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదం ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. కటౌట్లకు పెట్టిన కలపను బ్యారికేడ్లకు ఉపయోగించి ఉంటే బాగుండన్నారు. 3 గంటల పాటు పుష్కరఘాట్ల వద్దకు రాకుండా జనాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
భక్తులు ఆగ్రహం ఇది...!
కాగా, బాబు ఎక్కువ సేపు స్నానం ఆచరించడం వల్లనే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా నమస్తే తెలంగాణలో వార్తలు వచ్చాయి. మంగళవారం ఉదయం 4.30 గంటల నుంచి 8.30 గంటల వరకు పుష్కరఘాట్ల వద్దకు భక్తులను రానివ్వలేదన్నారు.
పుష్కర ఘాట్కు చేరుకున్న బాబు రెండు గంటల పాటు స్నానం చేశారని, రెండు గంటలు పూజలు చేశారని భక్తులు పేర్కొంటున్నారని రాసింది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ ఎక్కువైందని, తొక్కిసలాట జరిగింని, 25 మంది మృతి చెందారని చెబుతున్నారని రాసింది.
బాబు అర గంటలో స్నానం, పూజా కార్యక్రమం ముగించుకుని ఉంటే కూడా ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని భక్తులు చెబుతున్నారని, కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద కాకుండా సరస్వతి ఘాట్ వద్ద బాబు పుణ్యస్నానం ఆచరించిన ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెబుతున్నారని రాసింది.
పుష్కరఘాట్ నుంచి బాబు వెళ్లిపోయిన వెంబడే భద్రత పర్యవేక్షించాల్సిన పోలీసులు కూడా ఆయన వెంటే వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపు తప్పిందని, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారని రాసింది.