తిరుపతిలో తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి
తిరుపతి: వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. వారందర్నీ రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని రుయా ఆస్పత్రికి తరలించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు.
తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. తిరుపతిలోని ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా గురువారం ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. కాగా, ఒక దర్శన టికెట్ల సెంటర్ గేట్లు డీఎస్పీ ఓపెన్ చేయడంతోనే ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

ఒకరు అస్వస్థతకు గురికావడంతో వారిని బయటకు తరలించేందుకు గేట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భక్తులంతా దూసుకురావడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగినట్లు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు, రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలారావు చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Scary visuals are emerging. As per information, the number of casualties is probably three at this moment. #Tirupati #Stampede pic.twitter.com/CPLxMl9UAa
— Revathi (@revathitweets) January 8, 2025
తొక్కిసలాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్ పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం, ఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తిరుపతి నగర పాలక కమిషనర్ తెలిపారు. కాగా, జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు టికెట్ల కోసం తరలివచ్చారు.












Click it and Unblock the Notifications