రాజధానిగా అమరావతి విషయంలో లా పాయింట్ లాగిన సాయిరెడ్డి
ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి పార్లమెంట్ లో ప్రస్తావించారు. రాజధాని నగరాన్ని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.
అమరావతి: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చెలరేగిన దుమారం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. అదాని సంస్థలన్నింటినీ దాదాపుగా దివాళా తీయించే స్థితికి తీసుకొచ్చిందీ నివేదిక. స్టాక్ మార్కెట్లల్లో అదాని సంస్థల షేర్ల విలువ భారీగా పడిపోయింది. ఇప్పటికే ఆ కంపెనీ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయింద

మధ్యాహ్నం సజావుగా సభ..
అదాని ఎంటర్ ప్రైజెస్ ఇదివరకు ప్రకటించిన 20,000 కోట్ల రూపాయల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ను కూడా రద్దు చేయాల్సి పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తోన్నారు. సభా కార్యకలాపానలు స్తంభింపజేస్తోన్నారు. ఈ ఉదయం రెండు సెషన్లను వారు అడ్డుకున్నారు. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తరువాత సజావుగా సాగింది.

రాష్ట్రపతి ప్రసంగంపై..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ- కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. సూటి ప్రశ్నలతో చెలరేగారు. ఇదే తీర్మానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. మూడు రాజధాలను అంశాన్ని లేవనెత్తారు. పరిపాలన రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేసుకోవాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. తన రాజధాని నగరాన్ని రాష్ట్రమే నిర్ణయించుకుంటుందనీ తేల్చి చెప్పారు.

రాజధాని నగరాన్ని నిర్ణయించే హక్కు..
రాజధాని నగరాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహకపరమైన అంశమని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందనే విషయాన్ని విజయసాయి రెడ్డి పరోక్షంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ పిటీషన్ పై విచారణ ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టు సమక్షానికి రానున్న విషయం తెలిసిందే.

ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్..
మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. రాజధాని నగరాలు, హైకోర్టులు వేర్వేరు చోట్ల ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో ఆయన ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లను తెర మీదికి తీసుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్ హైకోర్టు భవనం అలహాబాద్ లో ఉందని, అలాగే ఛత్తీస్ గఢ్ హైకోర్టు బిలాస్ పూర్ సమీపంలోని బోద్రి నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

ఏపీని భిన్నంగా చూడొద్దు..
అదే తరహాలో అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టును తాము కర్నూలులో ఏర్పాటు చేయదలచుకున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏపీని ఎందుకు భిన్నంగా చూస్తారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశాన్ని కూడా ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని ధ్వజమెత్తారు. బెంగళూరులో నమ్మ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులను మంజూరు చేసిందని, విశాఖపట్నం మెట్రోకు ఎందుకు మొండిచెయ్యి చూపిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications