వెంటనే విభజించాలి, అయినా కలిసే ఉంటాం: జెపి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను ఆలస్యం చేయకూడదని, వెంటనే విభజన చేపట్టాలని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన బుధవారం కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, జైరాం రమేష్, కావూరి సాంబ శివరావు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్దంగా విభజన సమస్యకు పరిస్కారం చూపాలని కోరామని చెప్పారు. వారందరూ కూడా అదే కోరుకుంటున్నారని తెలిపారు.
అన్నదమ్ముల్లా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఆయన కోరారు. పరిస్థితి ఇంతవరకు వచ్చిన నేపథ్యంలో విభజనను మరికొంత కాలం పొడగించాలనుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. ఇప్పటికే రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ప్రజలు విడిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి కేంద్రం, రాజకీయ పార్టీలు భరోసా కల్పించాలని అన్నారు.
జైరాం రమేష్కు తమ పార్టీ తరపున పలు సూచనలు చేశామని జెపి చెప్పారు. అందరికీ మేలు చేస్తామని జైరాం అన్నట్లు తెలిపారు. అన్ని అంశాలు కూడా బిల్లులో పెట్టాలని కోరినట్లు జెపి తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రెవెన్యూ లోటు ఉండకుండా చూడాలని, పన్ను రాయితీలు ఇవ్వాలని కోరినట్లు, ఈ అంశాలను బిల్లు పెట్టాలని జైరాంకు సూచించినట్లు జెపి చెప్పారు. బిజెపిక కూడా అదే కోరుతోందని అన్నారు.
ప్రజల విశ్వసించే విధంగా విభజన జరిగేలా చూడాలని కోరినట్లు జెపి చెప్పారు. తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రోడ్లను మెరుగుపర్చాలని కోరినట్లు తెలిపారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరామని చెప్పారు. తాము కోరిన అంశాలపై పార్లమెంటు ప్రకటిస్తామని జైరాం చెప్పారని తెలిపారు. రేపేం జరుగుతుందోనని రెండు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటిగానే ఉంటారని జయప్రకాష్ నారాయణ అన్నారు. రాజకీయంగా పటం మీద గీత గీస్తే ప్రజలు విడిపోరని తెలిపారు. విభజన జరిగినా హైదరాబాద్, తెలంగాణ దేశ ప్రజలందరిదేనని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని, అయితే ప్రజలు విడిపోకూడదని పిలుపునిచ్చారు. భవిష్యత్ బాగుండాలని కోరువాలని అన్నారు.
విభజన సమస్యను ఇంకా పొడగించడం మంచిది కాదని జయప్రకాష్ నారాయణ అన్నారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రజల మధ్య వైషమ్యాలను పెంచొద్దని అన్ని పార్టీలు, మీడియా వర్గాలను ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ కోరారు. విభజన సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఉద్వేగ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా శాంతి నెలకొనెలా చూడాలన్నారు. ఇరు ప్రాంతాల ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు తొలగిపోవాలని అన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి రైల్వే జోన్ కేటాయించాలని కోరినట్లు తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేలా చూడాలని జైరాం రమేష్ ను కోరినట్లు తెలిపారు. వివిధ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు పన్ను రాయితీ కల్పించాలని జైరాంను కోరినట్లు జయప్రకాష్ నారాయణ తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ కలపాలని సూచించినట్లు చెప్పారు.