మృత్యు శకటం: బెజవాడలో బస్సు భీభత్సం, ఎలా జరిగింది?(ఫోటోలు)
విజయవాడలో జరిగిన ప్రమాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సత్తెనపల్లి వద్ద జరిగిన మరో ఘటనలో 8మంది గాయపడ్డారు.
విజయవాడ: సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్గా చెప్పుకునే ఆర్టీసీ బస్సులే ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నాడు రెండు వేర్వేరు ఘటనల్లో ఆర్టీసీ బస్సులు భీభత్సం సృష్టించాయి.
జనంపైకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురు మృతి (వీడియో)
విజయవాడలో జరిగిన ప్రమాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సత్తెనపల్లి వద్ద జరిగిన మరో ఘటనలో 8మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎలా జరిగింది:
విజయవాడ గవర్నర్ పేట-2 డిపో నుంచి బయలుదేరిన బస్సు శుక్రవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో వాంబేకాలనీ నుంచి బుడమనేరు వంతెన వద్దకు వచ్చింది. అక్కడి సెంటర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు వచ్చిన తర్వాత బస్సు అదుపు తప్పి ద్విచక్ర వాహనాల మీదకు దూసుకెళ్లింది.
అక్కడికక్కడే మృతి
అదుపు తప్పిన బస్సు ఎదురుగా వెళ్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మైలవరానికి చెందిన తల్లికుమార్తెలు షేక్ ఖుర్షీద్ బేగం(30), హర్షియా(11) బస్సు చక్రాల కింద నలిగి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
గాయపడ్డవారు:
మైలవరానికి చెందిన షేక్ అబ్దుల్ గఫార్, కరీముల్లా, షహీరా, షేక్ మీరా, దిల్సాద్, షేక్ సుభాని, నున్నకు చెందిన గుంటి నిహారిక, గుంటి వీరచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంఘటనా స్థలాన్ని పరీశీలించినవారు:
ప్రమాద సమాచారం అందుకున్న డీసీపీ క్రాంతి రాణా, ఏసీపీ నాయుడు, సీఐ ఎం సత్యనారాయణ, ఎస్ఐ నరేష్ కుమార్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణరావు, కార్పోరేటర్ పిన్నంరాజు త్రిమూర్తిరాజు, సీపీఎం నాయకుడు సీహెచ్ బాబురావు, వైసీపీ నాయకులు సామంతపూడి చిన్నా, అమ్ముల రవికుమార్ తదితరులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చికిత్స పొందుతూ మృతి:
సంఘటనా స్థలంలో క్షతగాత్రులకు సపర్యలు చేసి 108 వాహనంలో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుంటి రవిచంద్ర(30) పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. షేక్ మీరా, దిల్సాద్, షేక్ సుభాని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
డ్రైవర్ పరార్, బస్సుకు నిప్పు:
ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి నిప్పంటించారు. రంగంలోకి దిగిన పోలీసులు మంటలను ఆర్పివేశారు.