జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిః ఘాటుగా స్పందించిన నారా లోకేష్
గుంటూరుః గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. జనసేన ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు పార్టీ మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. గుంటూరులోని ఏటీ అగ్రహారంలో రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఏటీ అగ్రహారంలో జనసేన పార్టీ కళాజాతాలను నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన ప్రచార రథాలపైనా రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో కొందరు మహిళా కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాజకీయ రంగును పులుముకొంది. రాళ్లు రువ్వినవారు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటూ ప్రచారం మొదలైంది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి, జనసేన నాయకుడు రావెల కిశోర్బాబు ఆరోపించారు.
తము అధికారంలోకి వస్తున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ దాడిని మంత్రి లోకేష్ ఖండించారు. ఈ దాడికి పాల్పడింది వైఎస్ఆర్ సీపీ నాయకులేనని ధృవీకరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు !! అంటూ ట్వీట్ చేశారు. గాయపడ్డ వారి ఫొటోలను ఆయన జత చేశారు.
ట్వీట్ పై ట్రోల్స్..
జనసేప పార్టీ కార్యకర్తలపై జరిగిన రాళ్ల దాడి వైఎస్ఆర్ సీపీ పనే అని అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్పై విమర్శలు వస్తున్నాయి. రాళ్ల దాడి చేసింది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలే అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? అని డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీ-తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఇది నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వనజాక్షి మీద దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని నారా లోకేష్ను నిలదీస్తున్నారు. దళితులకు రాజకీయాలు ఎందుకు అంటూ చింతమనేని చేసిన కామెంట్స్ను ఎందుకు తప్పు పట్టలేదని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ సీపీ కార్యాలయంపై దాడి చేసి, గాయపరిచినప్పుడు ఏమయ్యారని ఎద్దేవా చేస్తున్నారు.