పవన్ కళ్యాణ్ పైకి రాయి: ఫ్యాన్స్ విధ్వంసం, చెప్పులు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైకి గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు. దీనిని అతను చూపించారు. ఆయన ఆదివారం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పైకి రాయి విసిరారు. దానిని ఆయి చూపిస్తూ... రాయి విసిరితే వెరవమని, బెదిరిస్తే భయపడమని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలిస్తే సహించమని, దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు.
పవన్ రాక ఆలస్యం, నీరు లేక అభిమానుల విధ్వంసం
పవన్ కళ్యాణ్ రాక ముందు అమీర్ పేటలోని సభాస్థలి వద్ద గందరగోళం ఏర్పడింది. నిర్వాహకులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అభిమానులు ఆగ్రహించారు. అమీర్పేటకు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సిన పవన్ రాత్రి 9గంటలకు వచ్చారు. అభిమాన నాయకుడు వస్తున్నారన్న ప్రచారంతో నాలుగు గంటల నుంచే సత్యం థియేటర్ సమీపంలోని సభాస్థలికి వేలాదిగా యువకులు, అభిమానులు తరలి వచ్చారు.
ఐదు గంటల నుంచి మరో పది నిమిషాల్లో పవన్ వస్తున్నారని వేదికపై నుంచి ప్రకటిస్తూనే ఉన్నారు. తాగునీరు కూడా లేకపోవడంతో 6.30 గంటల ఆగ్రహించిన అభిమానులు వేదికపైకి చెప్పులు విసిరారు. దీంతో వెంటనే స్పందించి వాటర్ ప్యాకెట్లు తెప్పించారు. రాత్రి 8.40 ప్రాంతంలో మరోసారి తోపులాట జరిగింది. దీంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీపాలు వెలగక అంధకారం నెలకొనడంతో మరోసారి ఆగ్రహించిన సభికులు వేదికపైకి చెప్పులు, రాళ్లు, నీళ్ల సీసాలు విసిరారు.
దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వేదిక ముందున్న వారిని చెదరకొట్టారు. ఈ క్రమంలో కొందరు కిందపడి స్వల్ప గాయాలపాలయ్యారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అలాగే మరికొందరు పవన్ ఎంతకీ రాకపోవడంతో ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వేదిక పైకి కుర్చీలు, ఇతర వస్తువులు విసిరారు. కుర్చీలను విరగ్గొట్టారు. పవన్ తొమ్మిది గంటల పది నిమిషాలకు వచ్చారు. ఆయన ఐదు నిమిషాలు మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నారు.