చంద్రబాబు సభపై రాళ్లు రువ్వారు: ఇద్దరికి గాయాాలు, ఎస్పీ ఆఫీసు ఎదుట బాబు బైఠాయింపు
చిత్తూరు: తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభలో కొందరు దుండగులు రాళ్లు విసిరారు. కృష్ణాపురం కూడలిలో జరిగిన రాళ్లదాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచా వాహనం దిగి రోడ్డుపై బఠాయించారు. గాయపడిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
సామాన్యుల పరిస్థితేంటంటూ చంద్రబాబు
దాడి నేపథ్యంలో తమ సభకు రక్షణ కల్పించాలంటూ నిరసన తెలిపారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నశించాలన్నారు. కాగా, ఆందోళనకు దిగిన చంద్రబాబు వద్దకు అదనపు ఎస్పీ మునిరామయ్య వచ్చి మాట్లాడారు. నిరసన విరమించుకోవాలని కోరారు.
రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు
ఆ తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కృష్ణాపురం చౌరస్తా నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. వినతి పత్రం ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ ఆఫీసుకు వెళ్లకుండా ఆపేయడంతో రోడ్డుపైనే చంద్రబాబు నిలబడ్డారు. దీంతో అదనపు ఎస్పీ సుప్రజ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఎస్పీకి ఆయన ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.
నా దాడిలో రాజకీయ కుట్రే..
తను పాల్గొన్న సభపై జరిగిన రాళ్ల దాడి ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని చంద్రబాబు ఆరోపించారు. అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. చట్టం కొందరికి చుట్టమైతే పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సభపై కుట్రపూరితంగానే దాడి జరిగిందన్నారు.
ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు
తన సభపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్గా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మంగళవారం తమ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ఉద్యోగులంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలన్నారు. టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ బరిలో ఉన్న విషయం తెలిసిందే.