ఏంటి ఈ న్యూసెన్స్..! నవ్వులపాలు చేయకండి..! ఆపండి..! వైసీపి ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్..!!
అమరావతి/హైదరాబాద్ : వైసీపిలోని కొంత మంది నేతలు చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆలూ లేదు చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది వైసీపీ నేతల వ్యవహారం. ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇక తమదే అధికారం అన్నట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. ఏకంగా మే 24వ తేదీ అంటే.. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి తమదే అధికారం అన్న రీతిలో వ్యవహార శైలి మారిపోయింది. ఎప్పుడు ఫలితాలు వస్తాయా.. ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామా.. అని రోజులు లెక్కపెట్టుకుంటున్నారట కొందరు నేతలు. ఎన్నికల ఓటింగ్ సరళి గమనించాక, ఇక వైసీపీదే అధికారం అని ఫిక్స్ అయిపోయారట కొంత మంది నాయకులు. ఇదే వ్యవహారం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోందట.
అతి` చాలు..ఇక ఆపండి..! ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న పార్టీ అదినేత..!!
అసలు ప్రజల తీర్పు ఎటు వస్తుందో.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వైసీపీ నేతల అత్యుత్సాహం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. ఫలితాలు రాకమునుపే అధికారంలోకి వచ్చేశామని చెప్పుకుని తిరుగుతుండటంతో వైసీపీ అధినేత జగన్ కూడా సీరియస్ అవుతున్నారు. అంతేకాదు.. కొందరు నేతల అతి ప్రవర్తనతో.. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటికే అధికారంలోకి వస్తామని చెబుతున్నప్పటికీ.. రేపు ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయితే ప్రజల్లో తలెత్తుకోలేమన్న ధోరణి పార్టీ పెద్దల్లో ఉంది.
మంత్రి పదవులపై అప్పుడే వైసీపీ నేతల ప్రచారం..! ఇబ్బందిగా భావిస్తున్న అదిష్టానం..!!
ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాజకీయమంతా వైసీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. `అతి` చేస్తున్న నేతలను జగన్ రోజూ పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్ పీకుతున్నారు. ఇంకొందరు నేతలను మాత్రం జిల్లా ఇన్ఛార్జుల ద్వారా మందలిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు కీలక నేతలు అప్పుడే తమకు ఆ మంత్రి పదవి వస్తుంది.. ఈ మంత్రి పదవి వస్తుంది.. అంటూ తెగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
సైలెంట్ ఉండాలని జగన్ హెచ్చరిక..! 23వరకు ఓపిక పట్టాలని హితవు..!!
ఇవన్నీ సన్నిహితుల వద్దనో.. కుటుంబసభ్యుల వద్దనో ప్రస్తావిస్తే ఫర్వాలేదు గానీ కొందరు ఏకంగా పార్టీ నాయకుల వద్ద కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసిన ఓ మహిళా అభ్యర్థి.. వైసీపీ అధికారంలోకి రాగానే తాను హోంమంత్రి అవుతానని ప్రచారం చేసుకుంటున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన మరో నేత తాను స్పీకర్ అని, అనంతపురం జిల్లాకు చెందిన నేత తనకు నీటి పారుదల శాఖ దక్కబోతోందని ప్రచారం చేసుకుంటున్నారు. వీరు బాధ్యతలు స్వీకరించేందుకు ఏకంగా పండితులను పిలిపించుకుని ముహూర్తాలు కూడా పెట్టించుకుంటున్నారట..!
పార్టీని నవ్వుల పాలు చేయొద్దంటున్న అదిష్టానం..! లోటస్ పాండ్ లో నేతలకు క్లాస్..!!
ఒకవైపు పార్టీ గెలుస్తుందో.. లేదో తెలియదు.. మరోవైపు నేతలు ఇలా తలో శాఖ తమది ప్రచారం చేసుకోవడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వారి అనుచరులు కూడా మరీఇంత అత్యుత్సాహామా.. అని నోరెళ్లబెడుతున్నారు. చివరికి ఈ విషయం కాస్త.. అటు ఇటు తిరిగి పార్టీ అధినేత జగన్ చెవిన పడింది. దీంతో సదరు అతి నేతలను లోటస్పాండ్లోని కార్యాలయానికి పిలిపించుకుని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. మే 23న ఫలితాలు వచ్చేవరకు ఎవరూ మాట్లాడవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి అతి చేస్తున్న నేతల ధోరణికి పార్టీకి మున్ముందు ఎలాంటి తిప్పలు వచ్చి పడతాయోనని కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.